- ప్రజలకు అందని సాంప్రదాయ యునాని వైద్యం
- విధులకు హాజరుకాని వైద్యులు, సిబ్బంది
- ఐదు పడకల ఆసుపత్రిలో ఓపి సేవలకే పరిమితం
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలో ఉన్న ప్రభుత్వ యునాని ఆసుపత్రి ఉన్న ప్రజలకు సాంప్రదాయం వైధ్యం అందకుండా నిరుపయోగంగా మారింది. ఆధునిక విశాలమైన భవనం నిర్మించిన వైద్యులు, సిబ్బందిని నియమించినప్పటికీ, ప్రజలకు ఎటువంటి వైద్య సేవలు అందడం లేదు. ఒక వైద్య అధికారి (సీనియర్ మెడికల్ ఆఫీసర్), ఒక మహిళా డాక్టర్ (డిస్టిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్), ముగ్గురు ఫార్మసిస్టులు, ఇద్దరు నాల్గవ తరగతి సిబ్బంది ఉన్నారు. వారు ఉదయం 10 గంటలకు ఆసుపత్రికి చేరుకుని మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి వెలుతున్నారని ఫిర్యాదులున్నాయి. యునాని వైద్యంలో దీర్ఘకాలిక వ్యాధులకు సమర్థవంతమైన చికిత్స ఉన్నప్పటికీ వైద్యులు ,సిబ్బంది ప్రజలకు అందుబాటులో లేకుండా కేవలం ఓపికి పరిమితమయ్యారు. మహిళా సిబ్బంది తగినంత లేకపోవడం, వైద్యులు లేకపోవడం వల్ల మహిళలకు, స్థానికంగా యునాని వైద్యానికి అలవాటు పడిన ప్రజలకు వైద్య సేవలు అందడం లేదు. కేవలం ఇద్దరు, ముగ్గురు వచ్చి హాజరు వేసుకొని వెలుతున్నారని సాయంత్రం వరకు ఆసుపత్రి తెరిచి ఉంచడం లేదని అపవాదు ఉంది.

నిజాం కాలంలో సుమారు 1936లో నగరంలోని పెద్ద బజార్ ప్రాంతానికి సమీపంలోని యునాని అసుపత్రిని నిర్మించారు. అందులో ఆనాడు సంప్రాధాయ వైద్యం యునాని వైద్యానికి కేరాఫ్ గా నిలిచింది. 5 పడకల ఆసుపత్రిలో దశాబ్ధాలుగా అక్కడ వైద్య సేవలు అందాయి. యునాని ఆసుపత్రిలో ప్రసూతి సేవలు కూడా అందిన ఘనత ఉండే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు అక్కడ పురాతన ఆసుపత్రిలో వైద్య సేవలు అందాయి. అది శిథిలావస్థకు చేరడంతో 2018లో గత ప్రభుత్వ హయాంలో, పాత భవనాన్ని కూల్చి నూతన నిర్మాణంకు రూ.70 లక్షల నిధులు ఆమోదించబడ్డాయి. దానితో అక్కడ ఆధునిక విశాలమైన భవనం నిర్మించబడింది. 5 పడకల ఆసుపత్రిని నియమించారు. 24 గంటల వైద్య సేవల కోసం సిబ్బందిని నియమించారు. వైద్యలను నియమించకపోవడంతో వారు ఓపికి పరిమితమై ఇన్ పేషేంట్ వైద్యం అందక దీర్ఘకాలికమైన వ్యాధులకు యూనాని వైద్యం అందకుండా పోతుంది.

యునాని, ఆయుర్వేద వైద్యాన్ని పునర్నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.70లక్షలను కేటాయించి నిర్మాణం గావించిన భవనంలో వైద్యం మాత్రం అందకపోవడంతో ప్రజలు నిరాశతో వెను దిరుగుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రాచీన యునానీ, ఆయుర్వేద వైద్యాన్ని ప్రోత్సహించడానికి ఆయుష్ విభాగం కింద సేవలందింస్తున్నారు. కానీ ఆధునిక ఆలోపతి (ఇంగ్లీష్ వైద్యం) బదులుగా సాంప్రదాయ వైద్య విధానాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వ యునాని ఆసుపత్రి యొక్క ఆధునిక భవనాన్ని నిర్మించారు. మరో ఇద్దరు వైద్యులు, సిబ్బందిని నియమిస్తే 24 గంటల వైద్య సేవలతో పాటు ఇన్ పేషేంట్ సేవలు అందించడం సాధ్యమౌతుంది. ఆయూష్ డిపార్ట్ మెంట్ కు చెందిన అధికారులు ఈ విషయంలో చొరవ తీసుకోక పోవడం వలన వారిపై అజమాయిషీ కరువైంది. దానితో వారు ఇష్టారీతిన విధులకు హాజరు కావడం లేదు. ప్రజలు వైద్యం కోసం మూడు గంటలు కూడా పనిచేయని పరిస్థితి నెలకొంది. లక్షలు వెచ్చించి నిర్మించిన యునాని ఆసుపత్రికి ఇప్పటి వరకు ఏ జిల్లా కలెక్టర్ సందర్శించలేదు. ఆయూష్ ప్రాంతీయ విభాగం అధికారులు రాలేదు. దానితో ఈ ప్రభుత్వ యునాని ఆసుపత్రి ప్రజా సంక్షేమానికి పనికిరానిదిగా మారింది. పాలకులు ఈ వృత్తిపరమైన యునాని ఆసుపత్రిని విజయవంతం చేయడంపై దృష్టి పెట్టడం అవసరం ఎంతైనా ఉంది.

