నందిపేట్, బతుకమ్మ: నందిపేట మండలం మల్లారం గ్రామంలో ఆదివారం రైతు భరోసా పథకం ప్రారంభోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రైతులకు ప్రతి ఎకరానికి రూ. 12,000 చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నట్లు అధికారులు తెలిపారు. సాగు భూములన్నింటికి ఈ పథకం వర్తింపజేయడం ద్వారా రైతుల ఆర్థిక భారాన్ని తగ్గించి, వ్యవసాయ ఉత్పత్తి మెరుగుపరచడమే ప్రధాన లక్ష్యమని వెల్లడించారు.
ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ..
నిరుపేదల కోసం ఇళ్ల మంజూరు పత్రాలను జిల్లా పరిషత్ సీఈఓ షాయన్న అందజేశారు. ఈ సందర్భంగా కొత్త రేషన్ కార్డులను కూడా పంపిణీ చేశారు. ఇళ్ల కల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిరుపేదలు ఈ పథకాన్ని స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేశారు. భూమిలేని వ్యవసాయ కూలీల కోసం ప్రతిఏటా రూ. 12,000 ఆర్థిక సహాయం అందించే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని కూడా కార్యక్రమంలో భాగంగా పంపిణీ చేశారు. ఈ పథకం కూలీల జీవితాలను మెరుగుపరిచే దిశగా చర్యలు తీసుకుంటుందని అయిలాపుర్ సొసైటీ ఛైర్మెన్ సుదర్శన్ వివరించారు. కార్యక్రమంలో ప్రత్యేక అధికారి జగన్నాథ్, తహసీల్దార్ ఆనంద్, మండల అభివృద్ధి అధికారి శ్రీనివాస్ రావు, వ్యవసాయ అధికారిని జ్యోష్న పాల్గొన్నారు.

సంతోషం వ్యక్తం చేసిన ప్రజలు..
స్థానిక ప్రజా ప్రతినిధులు, రైతులు, నిరుపేదలు పెద్ద సంఖ్యలో హాజరై ఈ పథకాలపై హర్షం వ్యక్తం చేశారు. రైతులు పథకాలు తమ భూముల్లో పెట్టుబడి భారాన్ని తగ్గించి, దిగుబడిని మెరుగుపరచడంలో సహాయపడతాయని తెలిపారు. ఇళ్ల మంజూరు పత్రాలు అందుకున్న వారు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, ఈ పథకం తమ జీవితాలలో కొత్త ఆశలు నింపిందని ఎన్నో ఏళ్లతో వెయ్యి కళ్లతో ఎదురు చూశాము కానీ గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం తమ గ్రామానికి ఒక్క ఇల్లు ఇవ్వలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామం లో 30 మంది దరఖాస్తు చేస్తే 27 మందికి మంజూరు చేయడం పట్ల గ్రామస్తులంతా సంతోషాన్ని వ్యక్తం చేశారు.

