మురికి కాలువలో పడి వరుసగా మృతి చెందుతున్న నగరవాసులు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మృత్యుకూపాలకు అడ్డగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మురికి కాలువలు మారుతున్నాయి. ఇటీవల కాలంలో నగరంలో ఎక్కడో చోట వరుసగా అందులో పడి అమాయక ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. అయితే ఎప్పటికప్పుడు మురికి కాలువలు శుభ్రం చేయడానికి ప్రత్యేక బృందాలు ఉన్నప్పటికీ నెలల తరబడిగా వాటిని శుభ్రం పరచక పోవడం వల్లే ప్రమాదవశాత్తు నగరవాసులు మురికి కాలువలు దాటే క్రమంలో అందులో పడి మృత్యువాత పడుతున్నారు. దీంతో వారి కుటుంబాలు తీవ్ర విషాదాన్ని మిగులుతుంది. మొన్నటికి మొన్న కిల్లా ప్రాంతంలో ఒకరు, అంతకుముందు అర్సపల్లి ప్రాంతంలో ఒకరు, ఇటీవల కాలంలో రైల్వే స్టేషన్ ప్రాంతంలో మరొకరు, ఆదివారం సాయంత్రంరూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బైపాస్ ప్రాంతంలో తాజాగా ఒకరు మురికి కాలువలో పడి మృతి చెందారు. అయితే అయితే ఇంతమంది మురికి కాలువలో పడి మృతి చెందినప్పటికీ మున్సిపల్ అధికారుల్లో మాత్రం ఏ మాత్రం చలనం రాకపోవడం కొసమెరుపు.
