
. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ
నిజామాబాద్, బతుకమ్మ: సంక్రాంతి సెలవులు రావడంతో జిల్లాలోని బస్టాండ్ లు ప్రయాణికులు కిక్కిరిశాయి. జిల్లా కేంద్రంలోని ప్రధాన బస్టాండ్ లో శుక్రవారం నుంచి ప్రయాణికుల రద్దీ నెలకొంది. హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు, ప్రైవేట్ ఉద్యోగులు జిల్లా కేంద్రానికి చేరుకుంటుండగా, జిల్లా కేంద్రంలోని హాస్టళ్లు, రూముల్లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులు తమ సొంతూళ్లకు పయనమయ్యారు. బస్సుల సంఖ్య తక్కువగా ఉండడంతో గంటల తరబడి బస్టాండ్ లో నిరీక్షిస్తున్నారు. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని టీజీ ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తెచ్చినా, ప్రయాణికుల సంఖ్యకు సరిపడా లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి హైదరాబాద్ నుంచి వస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. బస్సుల ఆలస్యం, ఎక్కువ సమయం పాటు నిలబడి ఉండాల్సిన పరిస్థితులు, రద్దీ కారణంగా ఎక్కడికక్కడ సమస్యలు ఎదురవుతున్నప్పటికీ, పండుగ ఆనందంలో ఈ ఇబ్బందులను పట్టించుకోవడం లేదని విద్యార్థులు ‘బతుకమ్మ’తో తెలిపారు.

