. . . సాగు నీరు అందక నానా అవస్థలు పడుతున్న రైతులు
రుద్రూర్, బతుకమ్మ :
సాగు నీరందక పొలాలు నెర్రెలు వారుతున్నాయి. ఈ వానకాలం ఇప్పటి వరకు తగినంత వర్షాలు పడలేదు. మరికొంత మంది బోరుబావులపై ఆధారపడి వరి సాగు చేసిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. భూగర్భ జలాలు తగ్గిపోయి వరి పంట వేసిన రైతులు సాగు నీరు అందక నానా అవస్థలు పడుతున్నారు. మండలంలో అడపాదడపా పడిన వర్షాలకు రైతులు వరి పంటలు సాగు చేశారు. వర్షాలు పడక భూగర్భ జలాలు తగ్గుముఖపడడంతో బోరు బావులు నుండి నీరు అందక వరి సాగు పంటలు పలుచోట్ల ఎండు దశకు చేరుకుంటున్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రుద్రూర్ మండలంలోని అంబం(ఆర్) గ్రామానికి చెందిన రైతు మమ్మాయి బాలరాజు వరి పంట సాగు చేశారు. వర్షాలు పడకపోవడంతో సాగు నీరు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. మరి కొన్నిచోట్ల పూర్తిస్థాయిలో వరి సాగు చేయలేదు. ఈసారి రెండు పంటలు దేవునికి ఎరుగు ఒక్క పంట కూడా సాగు అయ్యేటట్టు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడి సమయంలో ఎరువులు దొరకకుంటే ఇబ్బందులు పడి ఎరువులు సమకూర్చుకునీ పంటలు వేస్తే చేతికి అందేటట్టు కనబడతలేదని రైతులు వాపోతున్నారు. రైతులు వర్షాన్ని కొరకు ఆకాశాన్ని చూస్తున్నారు. వర్షం పడకపోగా ఎండలు కొడుతున్నాయి. దీంతో పంట పొలాలు నెరలు వాడుతున్నాయి వర్షాలు కురిసి పంట పొలాలు కాపాడాలని రైతులు దేవునిపై భారం వేస్తున్నారు.