నందిపెట్, బతుకమ్మ : డొంకేశ్వర్ మండలంలోని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్లో మంత్రులను ఆదివారం కలిసి వినతిపత్రం అందజేశారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పది సంవత్సరాలుగా లిఫ్ట్ ప్రాజెక్టులకు నిధులు అందకపోవడంతో అవి పూర్తిగా నిలిచిపోయాయని, ఇది రైతుల జీవనంపై తీవ్ర ప్రభావం చూపిందని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. లిఫ్ట్ ప్రాజెక్టులకు తక్షణమే నిధులు కేటాయించి, పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ నేత మహేష్ గౌడ్లను కలిసిన వారిలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ పెంట ఇంద్రుడు, డొంకేశ్వర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు భూమేష్, దత్తాపూర్ లిఫ్ట్ ఛైర్మెన్ రమణ, మరంపల్లి లిఫ్ట్ ఛైర్మెన్ బోజారెడ్డి తదితరులు ఉన్నారు.
