నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: ప్రజాపంథా తెలంగాణ రాష్ట్ర నాయకులు, మాజీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ కర్నాటి యాదగిరి సహచరి కామ్రేడ్ అనసూయ (78) క్యాన్సర్ వ్యాధితో సోమవారం ఉదయం చనిపోయారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోటగల్లీలో కామ్రేడ్ అనసూయ పార్థీవ దేహానికి సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) పార్టీ శ్రేణులు పార్టీ కార్యాలయం ఎన్.ఆర్ భవన్, కోటగల్లీలో విప్లవ నివాళి అర్పించారు. అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ వనమాల కృష్ణ అధ్యక్షతన సంతాప సభ నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు కామ్రేడ్ కే. రమ మాట్లాడుతూ కామ్రేడ్ కే యాదగిరి జీవిత సహచరిగా జీవితాంతం విప్లవ పార్టీకి సేవలందించిన కామ్రేడ్ అనసూయ కు కమ్యూనిస్టు విప్లవకారులకు ఆదర్శమన్నారు. కామ్రేడ్ యాదగిరి ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి, ఎమర్జెన్సీ కాలంలో అజ్ఞాత జీవితంలోకి వెళ్ళినా, కుటుంబ భారాన్ని అనసూయక్క నిర్వహించిందన్నారు. కామ్రేడ్ యాదగిరి సహచరిగానే కాకుండా పార్టీ సభ్యురాలిగా మహిళా సంఘం నాయకురాలిగా విప్లవజమానికి చేదోడు వాదోడుగా ఉందన్నారు.

చివరికి చనిపోయిన తర్వాత కూడా తన కళ్ళను లయన్స్ క్లబ్ వారికి, శరీరాన్ని ప్రభుత్వం మెడికల్ కాలేజీకి ఇచ్చి వైద్య విద్యార్థుల పరిశోధనకు ఉపయోగపడిందన్నారు.సంతాప సభ అనంతరం కామ్రేడ్ అనసూయ కుటుంబ సభ్యులు, బంధువులు, సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ శ్రేణులు ప్రభుత్వ మెడికల్ కాలేజీ వరకు ర్యాలీగా వెళ్లి కామ్రేడ్ అనసూయ పార్థివ దేహాన్ని మెడికల్ కాలేజీకి అప్పగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, పార్టీ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు ఎస్ఎల్ పద్మ, వి.ప్రభాకర్, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య, సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, సీపీఐ రాష్ట్ర నాయకులు కంజర భూమయ్య, సీఎల్సి జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ.రవీందర్, సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ పార్టీ నాయకులు ఎం.నరేందర్, పి.రామకృష్ణ, ఎం.వెంకన్న, ఎం.సుధాకర్, బి.దేవారం డి.రాజేశ్వర్, సాయన్న, గంగన్న, ముత్తెన్న, మల్లేష్, కిషన్, మురళి, సత్యక్క, గోదావరి గణేష్ రమేష్ కిషన్ తదితరులు పాల్గొన్నారు.

