- ఇకనైనా ప్రభుత్వ కార్యాలయాల్లో మార్పు కనిపించేనా..!
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన టి. వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మిక తనిఖీలతో హడలేత్తిస్తున్నారు. ప్రతిరోజు ఓ గ్రామాన్ని ఎంపిక చేసుకొని ఆ గ్రామంలోని కార్యాలయాలను పరిశీలిస్తున్నారు. అయితే కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు గోప్యంగా ఉంచడం వల్ల విధులకు డుమ్మాలు కొట్టే ఉద్యోగుల్లో గుబులు మొదలైంది. ఏ క్షణంలో కలెక్టర్ తమ కార్యాలయానికి తనిఖీలకు వస్తారో తెలియని పరిస్థితి ఏర్పడింది. దీంతో అనేక ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు,సిబ్బంది సమయపాలన పాటిస్తున్నారు. ప్రజలు సైతం ఇలాంటి మార్పునే కోరుకుంటున్నారని, కలెక్టర్ నిరంతర ప్రక్రియగా ఆకస్మిక తనిఖీలను చేపడితే ప్రభుత్వ కార్యాలయాల్లో పనితీరు మెరుగుపడుతుందన్న అభిప్రాయాలు మెజార్టీ ప్రజల నుండి వ్యక్తం అవుతున్నాయి. గతంలో ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడంతో కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇష్టారాజ్యంగా మారింది. సమయపాలన పాటించకపోవడంతో పాటు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం నిత్య కృత్యమైంది. ప్రజలు సైతం తమ పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొట్టడం, సమయానికి అధికారి అందుబాటులో లేకపోవడంతో నిరాశతో వెను దిరగడం అనేక ప్రభుత్వ కార్యాలయాల్లో షరా మామూలు మారింది. మండల, గ్రామస్థాయి ప్రభుత్వ కార్యాలయాల్లో జరగాల్సిన పనులు అధికారులు, సంబంధిత సిబ్బంది ఆలసత్వంతో నిలిచిపోవడం బాధితులను తీవ్ర నిరాశ కు గురిచేసిన సందర్భాలు ఉన్నాయి.. దీంతో జిల్లా కలెక్టర్ సమీకృత కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి భారీగా ఫిర్యాదులు అందుతున్నాయి.

ఇది కేవలం మండల, గ్రామస్థాయిలో సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే అక్కడ పనులు జరగక తమ గోడును వెళ్ళబోసుకునేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో జిల్లా కేంద్రానికి రావలసిన పరిస్థితి ఏర్పడింది. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా పాలన అధికారికి తమ ఆవేదనను తెలుపుకుంటే కొంతవరకైనా న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఏర్పడింది. వీటన్నిటికీ కారణం స్థానికంగా కార్యాలయాల్లో ఏ పని కూడా సరిగ్గా జరగకపోవడమే. ఇటీవల కొత్తగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి జిల్లా వ్యాప్తంగా మండల, గ్రామస్థాయిలో విస్తృతంగా పర్యటించడంతో కొంతవరకు మార్పు కనిపిస్తుంది. డుమ్మాలు కొట్టే ఉద్యోగులు కలెక్టర్ ఎప్పుడు వస్తాడో తెలియని పరిస్థితిలో సమయపాలన పాటిస్తున్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు కార్యాలయాల్లోనే ఉండి పనులను చక్కబెడుతున్నారు. ఈ మార్పు వెనుక కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు కారణమన్న

అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఉదయం క్యాంప్ నుండి బయలుదేరిన సమయానికి ఏ గ్రామానికి వెళ్తున్నారో కలెక్టర్ కు తప్ప ఇతరులకు తెలియకపోవడం నిర్లక్ష్యపు అధికారులు, సిబ్బంది గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. ప్రధానంగా వైద్య, విద్య పట్ల జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు పౌష్టికారంతో కూడిన మధ్యాహ్న భోజనాన్ని అందించాలని ఆకస్మిక తనిఖీల సందర్భంగా ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేస్తున్నారు.

విష జ్వరాల బారిన పడకుండా ముందస్తు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తూ వైద్యం అందించాలని వైద్య ఆరోగ్య శాఖను అప్రమత్తం చేస్తున్నారు. ఆకస్మిక తనిఖీలలో భాగంగా కుర్నపల్లి గ్రామంలో పారిశుద్ధ్యం పై నిర్లక్ష్యంగా వ్యవహరించిన గ్రామ కార్యదర్శి పై కలెక్టర్ మండిపడిన విషయం తెలిసిందే. కలెక్టర్ వ్యవహరిస్తున్న తీరు, పాలన పట్ల చూపిస్తున్న ఆసక్తి పలువురి ప్రశంసలను పొందుతున్నారు. ఇలాంటి మార్పుల పట్ల గ్రామీణ, పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ దీనిని ఇదేవిధంగా కొనసాగించాలని, అప్పుడే గాడి తప్పుతున్న ప్రభుత్వ పాలన మెరుగుపడుతుందని పలువురు కోరుతున్నారు.
