- రగ్గులు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులు
- ఏఐఎస్బి జిల్లా అధ్యక్షులు బైరాపూర్ రవీందర్ గౌడ్
రుద్రూర్, బతుకమ్మ : నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని సంక్షేమ వసతి గృహలల్లో విద్యార్థులకు అందించే రగ్గులను రాష్ట్ర ప్రభుత్వం ఇంకా పంపిణి చేయకపోవడంతో విద్యార్థులు చలి బారినపడి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని (ఏ.ఐ.ఎస్.బి) ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ జిల్లా అధ్యక్షులు బైరాపూర్ రవీందర్ గౌడ్ అన్నారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వాలు మారిన, అధికారులు మారిన సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు మాత్రం తిప్పలు తప్పడం లేదని ఆయన అన్నారు. ఒక వైపు సరైన వసతులు లేని అద్దె భవనలలో హాస్టల్ నిర్వహణ కొనసాగుతూ ఉంటే వాటికి సరైన కిటికీలు, తలుపులు లేకపోవడంతో చలి నుండి విద్యార్థులు నరకాయతన అనుభవిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అందించే రగ్గులను పంపించడంలో అలసత్వం వహించడం వలన విద్యార్థులు రాత్రి సమయంలో ఇబ్బందులకు గురవుతున్నారని, పేద విద్యార్థులంటే రాష్ట్ర ప్రభుత్వనికి చిన్న చూపో లేదా వారికి ఓటు హక్కు లేదనే కారణమో తెలియదు కానీ విద్యార్థులకు అందించే మౌలిక సదుపాయల కల్పన పట్ల రాష్ట్ర ప్రభుత్వం అలసత్వంపై విద్యార్థుల తల్లీతండ్రులు మండిపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా విద్యార్థులకు 2019 లో నాణ్యత గల రగ్గులను ప్రభుత్వం పంపిణి చేసింది. అప్పటి నుండి ఇప్పటి వరకు నాసిరకమైన పలుచని రగ్గులను పంపిణి చేయడం జరిగిందని ఆయన అన్నారు. చలి నుండి విద్యార్థులు రక్షణ పొందేందుకు క్వాలిటి కలిగిన రగ్గులతో పాటు స్వేటర్లను పంపిణి చేయాలని, కిటికీలు, డోర్లు లేని పాత బిల్డింగ్ లకు మరమ్మతులు చేయించి విద్యార్థులు చలి బారి నుండి కాపాడేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అధికారులు స్పందించి సకాలంలో విద్యార్థులకు రగ్గులను పంపిణి చేయాలనీ ఆయన కోరారు.
