నాగర్ కర్నూలు, బతుకమ్మ : నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మాచారంలో ఇందిరా సౌర గిరి జల వికాసం పథకంను సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, రాజనర్సింహ, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కాసేపట్లో బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు. అనంతరం పథకం లబ్ధిదారులకు సోలార్ పంపుసెట్లను పంపిణీ చేయనున్నారు. రాష్ట్రంలో అటవీ హక్కుల చట్టం కింద 6.69 లక్షల ఎకరాల విస్తీర్ణానికి పోడుపట్టాలు మంజూరయ్యాయి. ఇందులో విద్యుత్ సౌకర్యం లేని ఆరు లక్షల ఎకరాలకు ఈ పథకాన్ని వర్తింపచేస్తారు. గిరిజన రైతుకు రెండున్నర ఎకరాల కన్నా ఎక్కువ భూమి ఉంటే సింగిల్ యూనిట్ సింగిల్, తక్కువగా ఉంటే సమీప రైతులను కలిపి బోర్ వెల్ యూజర్ గ్రూపుగా ఏర్పాటు చేస్తారు. ఈనెల 25 వరకు మండలాల వారీగా అర్హులైన ఎస్టీ రైతులను గుర్తించి జూన్ 10 వరకు క్షేత్రస్థాయిలో పరిశీలన భూగర్భ జలాల సర్వే తదితర పనుల్ని గిరిజన సంక్షేమ శాఖ చేపడుతుంది. జూన్ 25 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు భూముల అభివృద్ధి బోరుబావుల తవ్వకం, సోలార్ పంపుసెట్ల ఏర్పాటు తదితర పనులను పూర్తి చేస్తారు. తొలి ఏడాదికి 10 వేల మంది రైతులకు చెందిన27,184 ఎకరాలను సాగులోకి తీసుకురానున్నారు. ఇందుకు దాదాపు రూ.600 కోట్లు ఖర్చు చేయనున్నారు.

