కామారెడ్డి, బతుకమ్మ : గ్రామ పాలన అధికారులు, లైసెన్సుడ్ సర్వేయర్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ తెలిపారు. లైసెన్స్డ్ సర్వేయర్ల కోసం ఎంపిక చేసి రెండు నెలల శిక్షణ అనంతరం ఆదివారం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సర్వేయర్లుగా శిక్షణను పొందిన అభ్యర్థుల నిర్వహించిన పరీక్షా సెంటర్ ను జిల్లా కలెక్టర్ సందర్శించి పరీక్షల నిర్వహణ తీరును పర్యవేక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ పాలన అధికారుల ఎంపిక పరీక్ష, లైసెన్సెడ్ సర్వేయర్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించడం జరిగిందని, పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించామని ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా, పరీక్షలను పకడ్బందీగా నిర్వహించామన్నారు. గ్రామ పాలన అధికారుల పరీక్ష ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించగా 109 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 81 మంది అభ్యర్థులు హాజరైనట్టు తెలిపారు. లైసెన్స్డ్ సర్వేయర్ల పరీక్షకు సంబంధించి ఉదయం సెషన్ 10.00 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్ 2.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు పరీక్షను కట్టుదిట్టంగా నిర్వహించామని 122 మంది అభ్యర్థులకు గాను 19 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్టు తెలిపారు. జిల్లా కలెక్టర్ వెంట జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ విక్టర్, కామారెడ్డి ఆర్టీవో వీణ, ఏడి సర్వే ల్యాండ్ శ్రీనివాస్, కలెక్టరేట్ ఏవో,డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ ఉన్నారు.

