- సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే ఎస్సీ వర్గీకరణ చేసినం
- తీర్పు వచ్చిన ఆరునెలల్లోనే బిల్లును ఆమోదించినం
కామారెడ్డి, బతుకమ్మ : షెడ్యూల్డ్ కులాల నడుమ సాధికారత, సమానత్వం కోసమే వర్గీకరణ చేస్తున్నట్టు పిసిసి డెలిగేట్ సభ్యులు విట్టల్ రెడ్డి తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన గంటలోపే సీఎం రేవంత్ రెడ్డి వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని అసెంబ్లీలో ప్రకటన చేశారని గుర్తుచేశారు. దేశంలో వర్గీకరణ అమలు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని అప్పట్లో ప్రకటించారని, ప్రస్తుతం ఆ మాటను నిలుపుకొన్నారని చెప్పారు. దళితుల దశాబ్దాల వర్గీకరణ కలను నెరవేరుస్తున్న లీడర్ సీఎం రేవంత్ రెడ్డి అని, సీఎంతోపాటు బిల్లుకు సహకరించిన కేబినెట్ సబ్కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్రెడ్డికి, ఇతర సభ్యులకు కృతజ్ఞతలు చెప్పారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి సామాజిక న్యాయ సాధికారతకు బాటలు వేస్తున్నారని, కులగణన, బీసీల రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ వర్గీకరణ అంశాలే ఆయన దార్శనికతకు తార్కాణమని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ డిమాండ్ కొత్తది కాదని, స్వాతంత్ర్యం వచ్చిన 15 ఏండ్లకే మొదలైందని గుర్తు చేశారు. వర్గీకరణ కోసం ఉమ్మడి రాష్ట్రంలో అనేక ఉద్యమాలు జరిగాయని, ఎంతో మంది త్యాగాలు చేశారని అన్నారు.
- ఇది కాంగ్రెస్ కమిట్మెంట్
సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన 6 నెలల్లోనే వర్గీకరణ చట్టం తీసుకొస్తున్నామని, ఇది కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ అని విఠల్ రెడ్డి చెప్పారు. 2025 ఫిబ్రవరి 4న సోషల్ జస్టిస్ డే, మార్చి 18వ తేదీలు చరిత్రలో నిలిచిపోతాయని తెలిపారు. గతంలో ఓ సారి వర్గీకరణ చేసినా.. కోర్టు తీర్పులతో అది నిలిచిపోయిందని, నాటి వర్గీకరణకు, నేటి వర్గీకరణకు పెద్దగా తేడా లేదని వివరించారు. కేవలం1.78 లక్షల జనాభా ఉన్న 26 కులాలు మాత్రమే ఇతర గ్రూపుల్లో చేర్చబడ్డాయని పేర్కొన్నారు. మాదిగల్లో ఈ 26 కులాల జనాభా 3.43 శాతమేనని, మిగిలిన 33 కులాలు పాత గ్రూపుల ప్రకారమే కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ధర్పల్ గంగాధర్, కాంగ్రెస్ సీనియర్ మైనార్టీ నాయకులు షేక్ భాషా సెట్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగనాథ్ , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లికార్జున్ అప్ప, సహిల్ శేట్కర్, శాఖాపూర్ తుకారం, కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు షేక్ సావేజ్, ఎమ్మార్పీఎస్ నాయకులు, ఇతర కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

