- రాజకీయ బ్రోకర్ జి.వివేక్ వెంకటస్వామి, మల్లు రవి, కే.ఆర్ నాగరాజు ని కాంగ్రెస్ పార్టీ నుండి వెంటనే సస్పెండ్ చేయాలి
- మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షులు బరికుంట శ్రీనివాస్ మాదిగ
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : సామాజిక న్యాయానికి నిలువెత్తు నిదర్శనమైన ఏబిసిడి వర్గీకరణ అని మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షులు బరికుంట శ్రీనివాస్ మాదిగ అన్నారు. నగరంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో మంగళవారం మాదిగ జేఏసీ అధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షులు బరికుంట శ్రీనివాస్ మాట్లాడారు. వర్గీకరణను అడ్డుకోవడానికి డిసెంబర్ 1న జరిపే వర్గీకరణ వ్యతిరేక మాలల సింహగర్జన సభను కొంతమంది స్వార్థపరమైన జి.వివేక్ వెంకటస్వామి. మల్లు రవి. కె ఆర్ నాగరాజు లాంటి రాజకీయ బ్రోకర్లు మాలలను రెచ్చగొడుతూ మాల మాదిగల మధ్యన వైశ్యామ్యాలు సృష్టిస్తూ వర్గీకరణకు కట్టుబడి ఉన్న కాంగ్రెస్ పార్టీ విధానాలను వ్యతిరేకిస్తున్న వీరిని క్రమశిక్షణ చర్యలలో భాగంగా పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వర్గీకరణకు అనుకూలంగా ఆగస్టు 1న ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిండు అసెంబ్లీ సాక్షిగా దేశంలో మొదట వర్గీకరణ చేసే రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణ చేసి మాదిగలకు న్యాయం చేస్తామని చెప్పారని అన్నారు. అంతేకాకుండా 2024 ఎలక్షన్ మేనిఫెస్టోలో మొదటి అంశంగా వర్గీకరణను చేర్చి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గె చేతుల మీదుగా చేవెళ్ల డిక్లరేషన్ లో వర్గీకరణ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసి కూడా ఈ ముగ్గురు కేవలం వారి వ్యక్తిగత రాజకీయ లబ్ది కోసమే మాల మాదిగల మధ్య వైశ్యామ్యాలు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. వీరిని కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ చర్యలలో భాగంగా సస్పెండ్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు.
