- గ్రామాలయం నుండి గుట్టకేగిన వెంకన్న
భీమ్ గల్, బతుకమ్మ : మార్గశిర శుద్ధ షష్ఠి సుముహూర్తంన పట్టణంలోని చొక్కయ్యగుట్టపై వెలసిన శ్రీశ్రీశ్రీ లక్ష్మీవేంకటేశ్వర స్వామి(శ్రీవెంకన్న) బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రతి యేటా మార్గశిర మాసంలో నిర్వహించినట్లేఈ యేడు మూడు రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ బొదిరే సంఘం సభ్యులు తెలిపారు. ఇందులో భాగంగా మొదటి రోజైన శుక్రవారం శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులను ఉదయం పట్టణంలోని గ్రామాలయం నుండి సుహాసినుల మంగళహారతులు, మంగళవాయిద్యాల మధ్య గోవిందా నామస్మరణతో ఊరేగింపుగా చొక్కాయగుట్టకు తీసుకువచ్చారు. స్వామి ఉత్సవమూర్తులు గుట్టకు చేరడంతో స్వామి ఉత్సవమూర్తులను గర్భలయంలో ఉంచి అర్చకులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. సాయంత్రం ఉత్సవాలు దిగ్విజయంగా పరిసమాప్తం అయ్యేందుకు ధ్వజరోహణం కార్యక్రమంను నిర్వహించారు. అనంతరం సంతాన ప్రాప్తి కోసం వచ్చిన భక్తులకు అర్చకులు గరుడ ముద్దలను ప్రసాదంగా ఇచ్చి,సంతాన లేమి భక్తులకు శ్రీగ్రంగా సంతాన ప్రాప్తి కలగాలని ఆశీర్వదించారు. మొదటి రోజు వెల్ నెస్ హస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ సుమన్ గౌడ్ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలను నిర్వహించారు. అర్చకులు సుమన్ గౌడ్ కు శేష వస్త్రాన్ని కప్పి, ప్రసాధాన్ని ఇచ్చి ఆశీర్వదించారు. ఈ సందర్బంగా సుమన్ గౌడ్ ఆలయ అభివృద్ధికి తనవంతు సహాయం చేస్తానని వెల్లడించారు.

