హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్రంలో చలి వణికిస్తోంది. ప్రత్యేకంగా ఉదయం, రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రాబోయే మూడు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సాధారణం కంటే కనిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని అధికారులు తెలిపారు. ప్రజలు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలు, గర్భిణీలు చలికి త్వరగా గురయ్యే అవకాశం ఉండటంతో వారు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాతావరణ శాఖ ఆదివారం ఏడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, కామారెడ్డి, నిర్మల్, సంగారెడ్డి ఈ ప్రాంతాల్లో రాత్రివేళల్లో చల్లటి గాలులు బలంగా వీచే అవకాశం ఉండటంతో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
