మాక్లూర్, బతుకమ్మ : విద్యుదాఘాతంతో బాలుడు మృతి చెందిన ఘటన మాక్లూర్ మండలంలోని మామిడి పల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మామిడిపల్లి గ్రామానికి చెందిన చింత ప్రవీణ్ రెడ్డికి ఇద్దరు కుమారులు. తన చిన్న కుమారుడు చింత అభినయ్(15) పదో తరగతి చదువుతున్నాడు. చింత అభినయ్ హాస్టల్ నుంచి దసరా సెలవులకు తన స్వంత ఊరికి వచ్చాడు. శనివారం తన తండ్రితో కలిసి పొలంలో నీరు పెట్టడానికి వెళ్లాడు. ఆ సమయంలో మోటార్ స్టార్టర్ వద్ద కరెంట్ ఆపే ప్రయత్నంలో ప్రమాదవశాత్తూ లైవ్ వైర్లను తాకడంతో విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఒకేసారిగా తండ్రి కేకలు వేయడంతో మరో రైతు తారక్ జగదీష్ రావడంతో తను అందించిన కర్ర సాయంతో అభినయ్ చేతకున్న కరెంట్ వైర్లు తొలగించారు. బంధువుల సహాయంతో నిజామాబాద్లోని మనోరమా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించగా, అక్కడి వైద్యులు అతను అప్పటికే మృతిచెందినట్లు ధృవీకరించారు. సంఘటనపై మాక్లుర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు.
