నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నగరంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో భారతీయ జనతా పార్టీ ఇందూర్ జిల్లా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండు రోజుల పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ తరగతులు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి మొదటి రోజు ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ ధర్మపురి అర్వింద్ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమానికి 96 శాతం మంది కార్యకర్తలు హాజరవడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొనడంతో శిక్షణ తరగతులు ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగాయి. అనంతరం భోజన విరామ సమయంలో కార్యకర్తలతో కలిసి భోజనం చేసి వారితో మమేకమయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో అనౌపచారికంగా మాట్లాడి పార్టీ కార్యక్రమాలపై చర్చించారు.

