కామారెడ్డి, బతుకమ్మ :
తీరని అప్పుల భారంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కామారెడ్డి రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం… బాన్సువాడకు చెందిన గతక రాజు (30) ఐదేళ్లుగా హైదరాబాద్లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. రెండేళ్ల క్రితం ఆయన తండ్రికి పక్షవాతం రాగా, వైద్యం కోసం బంధువుల దగ్గర రూ.15 లక్షల వరకు అప్పులు చేశారు. ఎంత ఖర్చు చేసినా తండ్రి ఆరోగ్యం నయం కాకపోవడం, అప్పులు తీర్చే మార్గం లేక రాజు తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. ఈ క్రమంలో కామారెడ్డి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 3 వద్ద గుర్తు తెలియని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
