కామారెడ్డి, బతుకమ్మ :
ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం శాంతాపూర్ గ్రామానికి చెందిన రూశేగాం భూమయ్య మాదిగ నియమితులయ్యారు. ఆదివారం హైదరాబాద్లోని సుప్రభాత్ హోటల్లో నిర్వహించిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నూతన రాష్ట్ర కమిటీని జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య మాదిగ ప్రకటించారు. ఈ సందర్భంగా భూమయ్య మాదిగకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాధ్యతలను అప్పగించారు. నియామకం అనంతరం రూశేగాం భూమయ్య మాదిగ మాట్లాడుతూ, గత 15 సంవత్సరాలుగా ఎమ్మార్పీఎస్లో నిబద్ధతతో పనిచేస్తున్న తనపై విశ్వాసం ఉంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించిన జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య మాదిగకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తాను చేపట్టిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ మాదిగ జాతి హక్కుల సాధన, సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాడుతానని ఆయన స్పష్టం చేశారు. అలాగే జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, జిల్లా ఇన్చార్జి నియామకం, నూతన జిల్లా కమిటీ ఏర్పాటులో జాతి మేధావులు, సీనియర్ నాయకులు, నియోజకవర్గ ఇన్చార్జిలు, మండల అధ్యక్షులు, యువత, కార్యకర్తలు చురుకుగా ముందుకు వచ్చి సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ నియామకంతో జిల్లాలో ఎమ్మార్పీఎస్ కార్యకలాపాలు మరింత బలోపేతం అవుతాయని నాయకులు, కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
