. . . మరో వారం రోజుల్లో సూర్య ప్రతాపం
. . . ఉక్కపోతతో ప్రజల బేజారు
. . . ఇంట్లో నుండి బయటకు వెళ్లాలంటే జంకుతున్న ప్రజలు
ఇందల్ వాయి, బతుకమ్మ :
రాష్ట్రవ్యాప్తంగా భానుడు ఉగ్రరూపంతో, భగభగ ఎండ వేడిమితో నిప్పులు విసురుతున్నాడు. మార్చి చివరి వారంలోనే ఎండ 40 డిగ్రీలకు చేరుకుంది. ఉదయం 10 అయ్యిందంటే చాలు భానుడి ప్రతాపం మొదలై సాయంత్రం 5 గంటల వరకు తీవ్రస్థాయిలో వడగాలులు రావడంతో ఇంట్లో నుండి బయటకు వెళ్లాలంటే ప్రజలు జంకుతున్నారు. మరో వారం రోజుల్లో ఎండ వేడి ఉగ్రరూపం దాల్చనుందని సంకేతాలున్నాయి. మార్చి చివరి వారంలోనే ఈ విధంగా ఎండలు ఎక్కువ అవ్వడంతో ఏప్రిల్, మే నెలల్లో ఎండల తీవ్రత తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. తీవ్ర వడగాల్పుల నేపథ్యంలో ఎండలో ప్రయాణించేటప్పుడు, బయటకు వెళ్లేటప్పుడు టోపీలు, మాస్కులు ధరించాలని, చల్లని పానీయాలు, నీరు ఎక్కువగా తాగాలని సూచిస్తున్నారు. వడగాల్పుల నేపథ్యంలో చిన్నపిల్లలను, వృద్ధులను బయటకి రాకుండా ఉంచడం ఉత్తమమని పేర్కొన్నారు.

