. . . రాబోయే ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలి
. . . సాధ్యమైనంత త్వరగా పెండింగ్ కేసులు క్లియర్ చేయాలి
. . . పోక్సో గ్రేవ్ కేసులలో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాలి
. . . నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
రోడ్డు ప్రమాదాల నివారణ కొరకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున ప్రజలలో అవగాహనా కార్యక్రమాలను చేపట్టాలని నిజామాబాద్ పోలీస్ కమీషనర్ సాయి చైతన్య అన్నారు. నిజామాబాద్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ అధికారులతో పి. సాయి చైతన్య ఆధ్వర్యంలో నిజామాబాద్ పోలీస్ కార్యాలయంలో మంగళవారం నెలవారి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలపై చర్చించారు. రాబోయే కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిగేలా అధికారులందరూ బాధ్యతగా తమ విధులు నిర్వర్తించాలని సూచించారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల నియమావళిని అనుసరించి పటిష్టమైన ప్రణాళికను తయారు చేసుకోవాలని తెలిపారు. ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పటిష్టమైన చర్యలు చేపట్టాలని కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై ఉక్కుపాదం మోపాలని ఆదేశాలు జారిచేసారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు ర్యాలీలు, సభలకు అనుమతి తీసుకోవడం తప్పనిసరని, ఎవరైనా ఉల్లంఘిస్తే వారిపై చర్యలు తప్పవని తెలియజేసారు. అలాగే పెండింగ్లో ఉన్న (అండర్ ఇన్వేస్టిగేషన్) కేసులలో గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల గురించి అడిగి, గ్రేవ్, నాన్ గేవ్ కేసులలో ఇన్వేస్టిగేషన్ చేసేటప్పుడు ప్రతి కేసులలో క్వాలిటీ ఇన్వేస్టిగేషన్తో పూర్తి పారదర్శకంగా చేయాలన్నారు. కేసు నమోదు నుండి చార్జీషీటు వరకు ప్రతి విషయాన్ని కూలంకుశంగా పరిశోధన చేసి ఫైనల్ చేయాలని తెలిపారు. పోక్సో, గ్రేవ్ కేసులలో త్వరితగతిన ఇన్వేస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో చార్జీషీటు దాఖాలు చేయాలన్నారు. ప్రతీ అధికారికి సి.సి.టి.ఎన్.ఎస్ పై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని, పెండింగ్ కేసుల విషయంలో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, కొత్త కేసు లతో పాటు చాలా కాలంగా ఉన్న పెండింగ్ కేసులను ఎప్పటికప్పుడు సమీక్షించడం వలన కేసుల సంఖ్య తగ్గించే విధంగా అన్ని స్థాయిల అధికారులు పనిచేయాలని అన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమర్ధవంతమైన సేవలు అందజేస్తూ సత్వరన్యాయం చేసేలా కృషి చేయాలనన్నారు. గ్రామ పోలీస్ అధికారులు (వి.పి.ఓ) ప్రతీ రోజు గ్రామాన్ని సందర్శించి ప్రజలతో మమేకమవుతు నేర నియంత్రణకు కృషి చేయాలని సూచించారు. కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా గ్రామాలలో సి.సి కెమెరాల ప్రాముఖ్యత అవగాహణ కల్పిస్తూ కృషి చేయాలని అన్నారు. సైబర్ క్రైమ్, డయల్ 100 వాటి వినియోగం పై విద్యార్థులకు ప్రజలకు అవగాహణ కల్పించాలనన్నారు. ఆన్లైన్ మోసాలకు గురి అయినట్లయితే 1930 కాల్ చేసి లేదా ఎన్.సి.ఆర్.పి https://www.cybercrime.gov. పోర్టల్ లో ఫిర్యాదు నమోదు చేయాలని అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలలో బ్లాక్ స్పాట్లుగా గుర్తించి సైన్ బోర్డులను ఏర్పాటు చేయించాలని సూచించారు. హైవే రోడ్డులను కలుపుతు ఉండే లింక్ రోడ్లకు స్పీడ్ బ్రేకర్స్ వేయించడం రోడ్డుకు అడ్డుగా ఉన్న పొదలను తొలగించే విధంగా చూడాలని అన్నారు. రోడ్డు ఇంజనీరింగ్ లోపాలు ఉన్నట్లయితే నేషనల్ హైవే, స్టేట్ హైవే అథారిటి ఇతర సంబంధిత అధికారులతో సమన్వయంతో ప్రమాదాల నివారణకు కృషి చేయాలని సూచించారు. అలాగే రోడ్డు ప్రమాదాలు జరుగకుండా ప్రతీ రోజు మీ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంకన్ డ్రైవ్ నిర్వహించి, ఓవర్ స్పీడ్, త్రిబల్ డ్రైవింగ్, మైనర్లు వాహనాలు నడుపుటలాంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలలో రోడ్డు భద్రత నిబంధనల గురించి అవగాహణ కల్పించాలని అన్నారు. విజిబుల్ పోలిసింగ్, పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని, బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించ కుండా చర్యలు తీసుకోవాలని దొంగతనాలు జరగకుండా పాతనేరస్థుల కదలికలపై నిఘా ఉంచాలని అన్నారు. అసాంఘిక కార్యకలాపాలు గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమరవాణ, క్రయవిక్రయాల పైన, జూదం, పి.డి.యస్. రైస్ అక్రమ రవాణలాంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. రిపిటెడుగా ఇలాంటి నేరాలకు పాల్పడేవారి పై PD యాక్టు కోసం పంపాలని ఆదేశాలు జారిచేశారు. ఈ సమావేశంలో అదనపు డి.సి.పి (అడ్మిన్) జి.బస్వారెడ్డి, నిజామాబాద్ ఎ.సి.పి రాజ వెంకట్ రెడ్డి, సైబర్ క్రైమ్ ఎ.సి.పి వై. వెంకటేశ్వర్ రావు, సి.సి.ఆర్.బి ఇన్స్పెక్టర్ అంజయ్య, నిజామాబాద్ డివిజన్ సి.ఐలు, ఎస్సైలు, ఐటి కోర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


