బతుకమ్మ : నాగిరెడ్డిపేట : ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్ ఆధ్వర్యంలో జాతీయ సేవా పథకం వేసవికాలం ప్రత్యేక శిబిరాన్ని మంగళవారం మండలంలోని పోచారం గ్రామంలో రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం బీఎస్సీ అగ్రికల్చర్ చివరి సంవత్సరం చదువుతున్న 120 మంది విద్యార్థినీలు ఎన్ఎస్ఎస్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీడీవో ప్రభాకర్ చారి,మాజీ సర్పంచ్ విజిత శ్రీనివాస్ రెడ్డి,ఏవో సాయికిరణ్, ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ అనిల్ రెడ్డిలు పాల్గొన్నారు.ఈ జాతీయ పథకం ప్రత్యేక శిబిరంలో భాగంగా రాబోయే ఏడు రోజులు మొక్కలు నాటే కార్యక్రమం, ప్లాస్టిక్ నిషేధం పై అవగాహన, స్వచ్ఛతహి’సేవ, వయ్యారిభామ కలుపు మొక్కల నిర్మూలనపై సామూహిక అవగాహన కార్యక్రమం, క్షేత్ర సందర్శన, మట్టి నమూనా సేకరణ, భూసార పరీక్షలు, జీవన ఎరువులు వాడకంపై శిక్షణ, ఉచిత వైద్య శిబిరం, లింగాకర్షణ బుట్టల ప్రదర్శన, కిచెన్ గార్డెన్, పోషకాహార భద్రత అవగాహన, రైతులకు శిక్షణ, మత్తుపదార్థాలపై నిషేధంపై అవగాహన, ఉన్నత విద్యపై స్థానిక ఉన్నత పాఠశాల విద్యార్థులకు ప్రేరణ చేపట్టడం తదితర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ అనిల్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ అధికారులు శ్రీలత, మీనా, చైతన్య, వాలంటీర్లు, పోచారం గ్రామ రైతులు పాల్గొన్నారు.
