. కేశవపట్నంలో ఉద్రిక్తత
. పోలీసుల కార్డన్ సెర్చ్ లో రూ.10 లక్షల కలప సీజ్
ఆదిలాబాద్, బతుకమ్మ: అక్రమంగా కలపను డంప్ చేశారనే సమాచారం అందడంతో తనిఖీలకు వెళ్లిన అటవీ శాఖాధికారులు, సిబ్బందిపై స్థానికుల సహయంతో స్మగ్లర్లు కర్రలతో దాడి చేశారు. అంతటితో ఆగకుండా రెచ్చిపోయిన స్మగ్లర్లు స్థానికుల సాయంతో అటవీశాఖ సిబ్బందిపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కేశవపట్నంలో సోమవారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటనతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీట్ ఆఫీసర్ జాదవ్ నౌశిలాల్ కు గాయాలుకాగా, ప్రభుత్వ వాహనాలు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఎస్సీ ఆదేశాల మేరకు అటవీశాఖ సిబ్బందికి భద్రత కల్పించడంతోపాటు గ్రామంలో కార్డన్ సెర్చ్ చేపట్టారు. ఈ సందర్భంగా రూ.10 లక్షల విలువైన కలపను గుర్తించారు. అటవీ సిబ్బందిపై దాడికి దిగిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాయాలపాలైన బీట్ ఆఫీసర్ జాదవ్ నౌశిలాల్ ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.