నిజామాబాద్ సిటి, బతుకమ్మ:
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కవులు, కళాకారుల పాత్ర పై సాంస్కృతిక సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో అదివారవ పెన్షనర్స్ భవన్ నిజామాబాదులో కమిటీ సభ్యులు రాధా కిషన్ అధ్యక్షతన సభను నిర్వహించారు. తెలంగాణ తొలి అమరవీరుడు దొడ్డు కొమరయ్యను, అమరవీరులను స్మరిస్తూ సాంస్కృతిక సభను ప్రారంభించారు.

సభలో గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ లెఫ్టినెంట్ డాక్టర్ మేకల రామస్వామి ముఖ్య అతిథిగా హాజరై తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కవులు, కళాకారులు చేసిన కృషితోనే ప్రజా చైతన్యం వచ్చిందని, తత్ఫలితంగా భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం పోరాటం విస్తృతమై నైజాం రాజును ప్రజలు గద్దెదించారని అన్నారు. ఆనాటి తెలంగాణలో నిజాం నవాబుకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుపార్టీ ఆధ్వర్యంలో భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా ప్రజలను కూడగట్టి రైతాంగ సాయుధ పోరాటాన్ని 1948 నుండి 52 వరకు నిర్వహించారని, నిజాం ప్రభుత్వ సైన్యాధిపతిగా ఉన్న కాసిం రాజ్వి తెలంగాణ ప్రజలను కమ్యూనిస్టులను సుమారు 2 వేల మందిని చంపారని, వేలాది మంది మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డారని తెలిపారు. ఎర్రజెండా నీడలో ప్రజలని జాగృతం చేసి 3 వేల గ్రామాల్లో గ్రామ స్వరాజ్యాలను ఏర్పాటు చేసి, 10 లక్షలు ఎకరాల భూమిని ప్రజలు స్వాధీనం చేసుకున్నారని ఆయన తెలిపారు.తెలంగాణ రైతాంగ పోరాట స్ఫూర్తి భారతదేశాన్ని ఆలోచింప చేసిందని, దేశంలో అనేక ప్రాంతాల్లో పోరాటాలకు మార్గాన్ని సుగుమం చేసిందని ఆయన తెలిపారు. కమ్యూనిస్టులు ప్రజలు తమ త్యాగాలతో నిజాము సర్కారుని వెనక్కి కొట్టగా, భారత ప్రభుత్వం కమ్యూనిస్టులను దెబ్బతీసే కుట్ర చేసిందని ఆయన తెలిపారు. ఈ ఉద్యమంలో బందగి, కవి ప్రాణాలను బలికున్నారని ఇంకా అనేకమంది కళాకారులను హత్య చేశారని ఆయన తెలిపారు. బండి యాదగిరి, సుద్దాల , కృష్ణమాచార్య లాంటి కవులని జైల్లో నిర్బంధించారని ఆయన వివరించారు. ప్రజల కోసం ఆలోచించడం, కవిత్వం రాయడం, పాట పాడడం హిమాలయాల కన్నా ఉన్నతమని ఆయన అన్నారు. నిజామాబాదులో ప్రత్యేకంగా ఈ సభను నిర్వహించినందుకు ఆయన అభినందించారు.

ఈ సభలో అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు సిర్ప లింగం మాట్లాడుతూ “కళ కల కోసం కాదని–ప్రజల కోసం అని” అందుకే ప్రజా కళాకారులనుయాది చేసుకోవడం ప్రజా కళా సంస్థల బాధ్యతని వారు తెలిపారు. సమాజానికి ఆర్థికం పునాదిగా ఉండి, కళలు సంస్కృతి ఉపరి కట్టడం గా ఉంటాయని, సమాజంలో సమస్యలపై ఉద్యమం రావడానికి, వచ్చిన ఉద్యమాన్ని ఉదృతం చేయడానికి ప్రజా కళారూపాలు దోహదం చేస్తాయని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో డప్పు ప్రదర్శన, డోలు ప్రదర్శన, గొబ్బియలు, నృత్యం, తెలంగాణ బ్యాలె దృశ్యాలు, పాండవుల కళాకారుల పాట, భజన కళాకారులు పాల్గొనీ ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. అరుణోదయ కళాకారులు అబ్దుల్, కె.గంగాధర్, నతానియల్, గోపాల్, బండమీది నరసయ్య, పోశెట్టి, మార్క్స్, శ్యామ్, సంజీవ్, డప్పు గంగారం, శివశంకర్, ప్రజానాట్యమండలి కళాకారులు గంగారాం, లక్ష్మన్, ఆర్గాన్ అంజన్న, డోలక్ నర్సింగ్, చంద్రకళ, శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
