- కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి
నిజామాబాద్, బతుకమ్మ : జిల్లాలో అర్హత కలిగిన కుటుంబాలు జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. అర్హత కలిగిన దరఖాస్తుదారులకు ఈ పథకం కింద రూ.20,000/- ఆర్థిక సహాయం అందజేయబడుతుందని ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాథమిక జీవనాధారాన్ని కోల్పోయిన కుటుంబాలకు జాతీయ కుటుంబ ప్రయోజన పథకం (NFBS) వర్తిస్తుందని అన్నారు. ప్రాథమిక జీవనాధార వ్యక్తి మరణించినట్లయితే, అతని వయస్సు 18 ఏళ్లు పైబడి, 60 ఏళ్ల లోపు ఉండాలని సూచించారు. అర్హులైన వారు మీ-సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అర్హత కలిగిన కుటుంబాలు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందేలా విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్ సూచించారు.
- 13న ఇందిరమ్మ ఇళ్ల “మార్కింగ్ మహా మేళా”..
ఈ నెల 13వ తేదీన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల “మార్కింగ్ మహా మేళా” నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా పెద్దఎత్తున ఇందిరమ్మ ఇళ్ళ మార్కింగ్ చేపట్టడం జరుగుతుందని అన్నారు. ప్రొసీడింగ్స్ పూర్తి అయి మార్కింగ్ చేసుకోలేకపోయిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు 13వ తేదీన మార్కింగ్ పూర్తి చేసి, ఇళ్ల నిర్మాణం ప్రారంభించేలా ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 17,301మంది లబ్దిదారులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని, వాటిలో ఇప్పటికే 9486 ఇండ్లు గ్రౌండింగ్ జరిగాయని కలెక్టర్ వివరించారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరీ పొందిన లబ్ధిదారులు మార్కింగ్ మహా మేళాను పురస్కరించుకుని ఈ నెల 13వ తేదీన మార్కింగ్ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
