ఇందూర్, బతుకమ్మ :
నిజామాబాద్ నగరంలోని కోటగల్లిలోని శంకర్ భవన్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, సమగ్ర విచారణ చేపట్టి, నిబంధనలకు విరుద్ధంగా పీఈటి, హెచ్ఎం లు డబ్బుల వసూళ్లు చేస్తున్నారనీ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పీడీఎస్ యు నగర కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్ సురేష్ కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పీడీఎస్ యు నగర సహాయ కార్యదర్శి ఆల్గోట్ సృజన్ మాట్లాడుతూ కోటగల్లిలోని శంకర్ భవన్ పాఠశాలలో విద్యార్థుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా వివిధ రకాల జరిమానాలు, ఫీజులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. యూనిఫాం ధరించకుండా వచ్చిన విద్యార్థుల నుంచి రూ.10, రెండు జడలు వేసుకోకుండా వచ్చిన బాలికల నుంచి రూ.20 చొప్పున జరిమానాలు వసూలు చేస్తున్నట్లు విద్యార్థులు తెలిపారని పేర్కొన్నారు. పాఠశాలలో క్రమశిక్షణ ఉండాలి, విద్యార్థులు యూనిఫాం ధరించడం, పాఠశాల నిబంధనలను పాటించడం వంటి విషయాల్లో అవగాహన కల్పించడంలో తప్పులేదని, అయితే క్రమశిక్షణ పేరుతో విద్యార్థులపై బలవంతం చేయడం, ఆర్థిక జరిమానాలు విధించడం మాత్రం సమంజసం కాదన్నారు.చాలామంది విద్యార్థుల తల్లిదండ్రులు పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారని, యూనిఫాం కొనడానికి కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలు ఉన్నప్పుడు, యూనిఫాం ధరించలేదనే కారణంతో జరిమానా ఎలా చెల్లించగలరని ప్రశ్నించారు. విద్యార్థుల కుటుంబ ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా వారిపై ఒత్తిడి చేయడం సరికాదన్నారు. విద్యార్థుల హక్కులను పరిరక్షిస్తూ, వారికి భయరహితమైన, ఆహ్లాదకరమైన , నాణ్యమైన విద్యా వాతావరణం కల్పించేందుకు జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని, సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరారు.విద్యార్థులపై ఆర్థిక భారం మోపే విధానాలను నిలిపివేసి, ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ యు నాయకులు నితిన్, శ్రీశాంత్,రంజిత్,మోహన్ తదితరులు పాల్గొన్నారు.
