- ఏఐఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి రఘురాం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : యువతకు ఉపాధి కల్పించే భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ యాక్ట్ తీసుకురావాలని ఏఐఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి రఘురాం డిమాండ్ చేశారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో అమర వీరుడు భగత్ సింగ్ 118వ జయంతిని ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని భగత్ సింగ్ చౌరస్తా వద్ద ఉన్న భగత్ సింగ్ విగ్రహానికి ఏఐఎస్ఎఫ్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రఘురాం మాట్లాడుతూ.. “భగత్ సింగ్ ఆలోచనలు, త్యాగాలు నేటి యువతకు ఆదర్శం కావాలి. సమానత్వం, శోషణ నిర్మూలన, విద్య, ఉద్యోగ హక్కుల కోసం భగత్ సింగ్ పోరాటం నేటికీ ప్రేరణనిస్తోంది. నేటి విద్యార్థి సమస్యలు, నిరుద్యోగం, ప్రైవేటీకరణ, ఫీజుల పెంపు, కాంట్రాక్టు విధానాలు – ఇవన్నీ కూడా భగత్ సింగ్ కలలు కన్న సమాజానికి విరుద్ధం. విద్య అందరికీ అందుబాటులో ఉండేలా ప్రభుత్వం కృషి చేయాలి” అని అన్నారు. అమర వీరుల త్యాగాలను స్మరించుకుంటూ విద్యార్థులలో పోరాట స్ఫూర్తి పెంపొందించాలని, సమాజంలో సమానత్వం నెలకొల్పడానికి ఐక్యంగా కృషి చేయాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి కుషాల్,జిల్లా నాయకులు నవీన్ కృష్ణ,నితిన్,రమేష్, మదు, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రంజిత్, ఫిరోజ్ ఆలీ,ఇమ్రాన్ ఆలీ పాల్గొన్నారు.

