- మధ్యాహ్నం 1:45కు నిజామాబాద్ కు రాక
- హెలిక్యాప్టర్ ద్వారా ఇందూర్ కు చేరిక
- డీఎస్ కాంస్య విగ్రహావిష్కరణ
- కిసాన్ మహా(బహిరంగ) సభతో పర్యటన ముగింపు
నిజామాబాద్, బతుకమ్మ : ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. మూడు దశాబ్ధాల పసుపు రైతుల కళను నెరవేర్చేందుకు ఏర్పాటైనా జాతీయ పసుపు బోర్డు కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేతుల మీదుగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో హైదరాబాద్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అమిత్ షా పర్యటన ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ఆయన రాక కోసం పోలీసు శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం ఉదయం గుజరాత్ లోని అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి విమానంలో హైదరాబాద్ లోని బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలిక్యాప్టర్ లో మధ్యాహ్నం 1:45 నిమిషాలకు కొత్త కలెక్టరేట్

కార్యాలయంలోని హెలిప్యాడ్ లో ల్యాండ్ అవుతారు. మధ్యాహ్నం 2 గంటలకు జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం బస్వాగార్డెన్ లో జాతీయ పసుపు బోర్డు అధికారులు, తెలంగాణ రాష్ట్ర అధికారులతో సమావేశం అవుతారు. బస్వాగార్డెన్ నుంచి కంఠేశ్వర్ బైపాస్ రోడ్డులో ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన దివంగత మాజీమంత్రి ధర్మపురి శ్రీనివాస్ కాంస్య విగ్రహాన్ని 3:25కు ఆవిష్కరించనున్నారు. అక్కడి నుంచి నేరుగా పాలిటెక్నిక్ మైదానంలో 3:30 నిమిషాల్లో ఏర్పాటు చేసిన కిసాన్ ముఖ్య అతిథిగా మహాసభ లో పాల్గొంటారు. 4:55 కు నిజామాబాద్ నుంచి హెలిక్యాప్టర్ లో బేగం పేట్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా హెలిక్యాప్టర్ లో ఢిల్లీకి వెళ్లేందుకు షెడ్యూల్ ఖరారు అయింది. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ పర్యవేక్షణలో పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభంతో పాటు డీఎస్ కాంస్య విగ్రహావిష్కరణ, కిసాన్ మహాసభ ఏర్పాట్లు చురుకుగా జరిగాయి.

