. . . తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) డిమాండ్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులందరికీ ప్రభుత్వం రూ.4016 జీవన భృతి ఇవ్వాలని నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట బీడీ కార్మికులు ఆందోళన చేపట్టి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు రమేష్ బాబు మాట్లాడుతూ, నిజామాబాద్ జిల్లాలో రెండున్నర లక్షల మంది బీడీ కార్మికులు ఉండగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న కొద్దిమందికి మాత్రమే జీవనభృతి చెల్లించి, మిగతా కార్మికులందరికీ మొండి చేయి చూపిందని మండిపడ్డారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులందరికీ రూ.4016 పెంచి, జీవన భృతి చెల్లిస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాట తప్పిందన్నారు. వెంటనే బీడీ కార్మికులందరికీ ప్రభుత్వం జీవన భృతి ఇవ్వాలని, లేకపోతే రానున్న రోజుల్లో బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులందరితో కలిసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు గంగా మోహన్, కోశాధికారి నన్నేసాబ్, బీడీ కార్మికులు మహబూబ్, నవీన్, రజిని, లక్ష్మీ, సుజాత, తదితరులు పాల్గొన్నారు.

