. . . అదనపు కలెక్టర్ భుజంగ రావు
మాక్లూర్, బతుకమ్మ :
విద్యార్థుల శారీరక, మానసిక ఎదుగుదలకు అల్బెండజోల్ మాత్రలు ఎంతగానో ఉపయోగపడతాయని, విద్యార్థులందరూ ఈ మాత్రలు వేసుకోవాలని అదనపు కలెక్టర్ భుజంగ రావు అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా సోమవారం మాక్లూర్ మండలం దాస్ నగర్లోని మహాత్మ జ్యోతిబా పూలే హైస్కూల్లో ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఒకటి నుంచి 19 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులందరికీ ఆల్బెండజోల్ మాత్రలను అందిస్తున్నట్లు తెలిపారు. నులిపురుగులు, కొంకిపురుగులు వంటి పరాన్నజీవుల వల్ల విద్యార్థుల్లో రక్తహీనత, అలసట, కడుపునొప్పి, డయేరియా, డీసెంట్రీ వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. అందువల్ల 1 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులు ఆల్బెండజోల్ మాత్రను బాగా నమిలి తీసుకోవాలని సూచించారు. భోజనానికి ముందు, మల విసర్జన తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవడం వంటి వ్యక్తిగత పరిశుభ్రత అలవాట్లను పాటించాలని తెలిపారు. విద్యార్థులకు పోషకాహారం, వ్యక్తిగత పరిశుభ్రతపై కూడా పలు సూచనలు చేశారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రాజశ్రీ మాట్లాడుతూ, జిల్లాలో 1 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల అర్హులైన విద్యార్థులు మొత్తం 3,90,297 మంది ఉన్నారని తెలిపారు. విద్యార్థులు చేతివేళ్ల గోళ్ల శుభ్రతను పాటించాలని సూచించారు. బాలికల్లో రక్తహీనత నివారణకు ఐరన్, కాల్షియం, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలని సూచించారు. జూలై 13న ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోని విద్యార్థులు జూలై 20 న తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఐఓ డా.అశోక్, రీజనల్ కో ఆర్డినేటర్ సత్యనాథ రెడ్డి, డీఈఓ అశోక్, డిప్యూటీ డీఎంహెచ్ఓ డా.సికందర్ నాయక్, పాఠశాల ప్రిన్సిపాల్ స్వప్న, ప్రోగ్రామ్ అధికారులు డా.శిఖర, డా.నవ్య, డా.అజ్మల్, డా.అరవింద్, డిప్యూటీ డెమో దుర్గారావు, డీహెచ్ఈ ఘన్పూర్ వెంకటేశ్వర్లు, డీఈఐసీ మేనేజర్ సచిన్, సీహెచ్ఓ గిరిబాబు, ఆర్బీఎస్కే సిబ్బంది, పర్యవేక్షణ అధికారులు కిషన్, ప్రమీల, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, పాఠశాల విద్యార్థినులు పాల్గొన్నారు.

