. . . ప్రీ-ప్రైమరీ తరగతులతో చిన్నారులకు నూతన విద్యా వసంతం
బిచ్కుంద, బతుకమ్మ :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రీ-ప్రైమరీ విద్యా విధానంలో భాగంగా వాజిద్ నగర్ గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గురువారం అక్షరాభ్యాస కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. స్థానిక సర్పంచ్, మండల విద్యాధికారి సమక్షంలో 3 నుండి 5 ఏళ్ల వయస్సు గల చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి ఏ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, “ప్రభుత్వం ఈ ఏడాది నుండి ప్రీ-ప్రైమరీ తరగతులను ప్రారంభించడం హర్షణీయం. గ్రామీణ ప్రాంత పిల్లలకు నాణ్యమైన విద్య అందుబాటులోకి వచ్చింది” అని తెలిపారు. సమగ్ర శిక్షా పథకం కింద ఈ పాఠశాలకు ప్రత్యేకంగా ప్రీ-ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ను నియమించారు. అర్హత కలిగిన స్థానిక మహిళకు రూ.8,000 గౌరవ వేతనంతో నియామకం ఇచ్చారు. అలాగే చిన్నారుల సంరక్షణ కోసం ఆయాను కూడా రూ.6,000 వేతనంతో నియమించారు. ప్రైవేట్ స్కూళ్లలో వేలకు వేలు ఫీజులు కట్టలేకపోయేవాళ్లం. ఇప్పుడు మా ఊరి స్కూల్లోనే ఎల్కేజీ, యూకేజీ ఉచితంగా చెప్పడం చాలా సంతోషంగా ఉందని విద్యార్థుల తల్లిదండ్రులుఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సీమ గంగారం, పాఠశాల బోధన, బోధ నేతర సిబ్బంది పాల్గొన్నారు.

