వడ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు
తిరుమల, బతుకమ్మ: తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనంలో గురువారం టీటీడీ ఈవో జె.శ్యామలరావు, అదనపు ఈవో సీ.హెచ్.వెంకయ్య చౌదరిలతో కలిసి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు భక్తులకు వడ వడ్డింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ బీఆర్ నాయుడు మాట్లాడుతూ, తాను బాధ్యతలు స్వీకరించిన తర్వాత అన్న ప్రసాదం మెనూలో భక్తులకు అదనంగా ఒక పదార్థం వడ్డించాలని ఆలోచన కలిగిందన్నారు. ఈ విషయాన్ని సీఎం నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లగా ఆయన అంగీకారంతో వడల వడ్డింపు కార్యక్రమాన్ని ఈరోజు నుంచి ప్రారంభించామన్నారు. ఇప్పటికే నాణ్యమైన దినుసులతో భక్తులకు రుచికరమైన అన్న ప్రసాదాలు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. భక్తులకు పంపిణీ చేసే వడ తయారీలో శెనగపప్పు, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర, పొదీన, సోంపును ఉపయోగించనున్నారు.

