. . . బిజెవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంతోష్ వెల్లడి
ముప్కాల్, బతుకమ్మ :
2024-25 సంవత్సరంలో ఎం.జి.ఎన్.ఆర్.జి.ఎస్ నిధుల కింద 75 లక్షల నిధులు మంజూరు అయ్యాయని, ఆ నిధుల దుర్వినియోగం అయినట్లు బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంతోష్ అన్నారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 11 కిలోమీటర్ల డ్రైనేజీ ఉందని చూయించి నిర్మాణం పనులను చేపట్టకుండానే సుమారు నాలుగు లక్షల రూపాయల నిధులను ఎం.బి రికార్డు చేసి అధికారులకు చూపించి తప్పుదోవ పట్టించారని ఆయన ఆరోపించారు. గతంలో ఇప్పుడున్న సర్పంచ్ భర్త నే సర్పంచ్ గా కొనసాగాడని, అతని హయాంలో సుమారు 4 కోట్ల నిధుల దుర్వినియోగం జరిగిందని అధికారుల దృష్టికి తీసుకు వెళ్తే, గ్రామ పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేయడం జరిగిందన్నారు. అయినప్పటికీ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం ముప్కల్ గ్రామపంచాయతీలో అవినీతి మాత్రం ఆగడం లేదని సంతోష్ ఆరోపించారు. సర్పంచ్ ఎన్నికలు జరిగి పదవి బాధ్యతలు చేపట్టి మూడు నెలలలోపే వార్డు మెంబర్ల సంతకాలను సైతం ఫోర్జరీ చేసిన ప్రస్తుత గ్రామ కార్యదర్శి పై ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. గ్రామపంచాయతీ తీర్మానంలో 75 లక్షల ఎంజిఎన్ఆర్ జిఎస్ నిధులతో సర్పంచ్ పనులను కొనసాగించాలని తీర్మానం చేసినా, సర్పంచ్ భర్తకు ఏ హోదాలో కాంట్రాక్ట్ ఇచ్చారో పాలకవర్గం తెలియజేయాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై, నిధుల దుర్వినియోగంపై సంబంధిత అధికారులు దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సతుల స్థానంలో పతులు కొనసాగితే సర్పంచులను తొలగించాలని ప్రభుత్వం నిబంధనలు జారీ చేసినప్పటికీ, జిల్లా కలెక్టర్ జిల్లాలో ఇలాంటి సంఘటనలు బహిర్గతమైతే స్పందించి సస్పెండ్ చేసిన దాఖలాలు ఉన్నాయన్నారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకొని ముప్కాల్ గ్రామపంచాయతీలో జరిగిన అవినీతిపై, నిధుల దుర్వినియోగానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, మళ్లీ ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని సంతోష్ కోరారు.

