బతుకమ్మ,మోర్తాడ్: కనులు తెరిచిన క్షణం నుంచి బంధం కోసం, బాధ్యత కోసం, కుటుంబం కోసం, అందర్నీ కనుపాపలా తలంచి ఆత్మీయత పంచి తన వారి కోసం అహర్నిశలు కష్టించి వారిని సహించి వారి భవిష్యత్తు గురించి తన ఇంటిని నందనవనం చేసే వ్యక్తి మహిళని మోర్తాడు ఎంపీడీవో తిరుమల దేవి అన్నారు. మహిళా దినోత్సవంను పురస్కరించుకొని శనివారం మోర్తాడ్ మండల కేంద్రంలో ప్రత్యేక మహిళ గ్రామ సభను ఆమె నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ సిబ్బందిని, పంచాయతీ కార్యదర్శులను, అంగన్వాడి టీచర్లను, ఆరోగ్య సిబ్బందిని, స్థానిక మహిళలను శాలువాతో సన్మానించి వారికి బహుమతులు అందించడం జరిగింది. కార్యక్రమంలో ఏపీఓ శకుంతల, పంచాయతీ కార్యదర్శి లక్ష్మి దుర్గ, అంగన్వాడి టీచర్లు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

