. . . పీడీఎస్ యూ వినతి
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
మోడల్ స్కూల్ హాస్టల్ సిబ్బంది వద్ద జిల్లా విద్యాశాఖ పరిధిలోని సమగ్ర శిక్ష అభియాన్ (ఎస్.ఎస్.ఎ) లో డాటా ఎంట్రీ ఆపరేటర్ గా పనిచేస్తున్న వ్యక్తి వసూళ్లకు పాల్పడిన విషయమై సమగ్ర దర్యాప్తు జరిపించి, తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టరేట్ ఏవో కి పీడీఎస్ యూ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పీడీఎస్ యూ జిల్లా అధ్యక్షులు డాక్టర్ కర్క గణేష్, నగర ప్రధాన కార్యదర్శి ఆర్.వినోద్ కుమార్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా సమగ్ర శిక్ష అభియాన్ లో డాటా ఎంట్రీ ఆపరేటర్ గా పనిచేస్తున్న వ్యక్తి మోడల్ స్కూల్ హాస్టల్ సిబ్బంది వద్ద వేతనాల విషయమై ప్రతి హాస్టల్ నుండి 5 వేల నుంచి ఏడు వేల రూపాయలు వసూలు చేస్తున్నట్టు తెలిపారు. తగిన ఆధారాలు ఉన్నాయని పేర్కొంటూ పత్రికలో కథనం వచ్చిందన్నారు. అతను చెప్పిన డబ్బులు ఇవ్వకుంటే సిబ్బందిని ఏదో కారణాలతో కార్యాలయానికి పిలిపిస్తాడని, ఇతర కారణాలతో ఇబ్బంది చేస్తాడని ఆ కథనంలో పేర్కొన్నారన్నారు. సదరు వ్యక్తిపై ఇప్పటికే అనేక ఆరోపణలు ఉన్నాయని కూడా ప్రచారంలో ఉందని గుర్తుచేశారు. ఈ కథనంపై సమగ్ర దర్యాప్తు జరిపించి, తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ యూ నగర సహాయ కార్యదర్శి అల్గోట్ సృజన్, నగర నాయకులు ఇస్ప్రీత్, కరణ్, ధీరజ్, చందు, భరత్ తదితరులు పాల్గొన్నారు.
