— జాతీయ రహదారి రోడ్డు వెడల్పు పనుల్లో నాణ్యత డొల్ల
— ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం, నాణ్యత చేపట్టని గుత్తేదారు
బతుకమ్మ : నాగిరెడ్డిపేట్ : మండలంలోని బంజారా తండా గ్రామం సమీపంలో జాతీయ రహదారి 365 డి రోడ్డు వెడల్పు పనుల్లో బాగా చేపడుతున్న బోధన్ — హైదరాబాద్ ప్రధాన రహదారిపై ఆదివారం మధ్యాహ్నం ఓ లారీ దిగబడి తృటిలో ప్రమాదం తప్పినట్లు అయింది. రోడ్డు వెడల్పు పనుల్లో భాగంగా బంజారా తాండ గ్రామం వద్ద కల్వర్టుపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టుతుండడంతో వాహనాలు వెళ్లేందుకు సంబంధిత కాంట్రాక్టర్ రోడ్డు ప్రక్కనుండి నాణ్యత లేకుండా మట్టి రోడ్డు ఏర్పాటుచేసి వాహనాలను దారి మళ్లించారు. దీంతో మట్టి రోడ్డుపై వెళ్తున్న లారీ కి ఎదురుగా మరో వాహనం రావడంతో దిగబడిన లారీ డ్రైవర్ రోడ్డు పక్కనుండి వెళ్తుండగా, మట్టి రోడ్డు నిర్మాణం నాణ్యతగా చేపట్టకపోవడంతో లారీ మట్టి రోడ్డు పై దిగబడి బోల్తా పడేందుకు సిద్ధంగా ఉండడంతో లారీ డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి లారీని బోల్తా పడకుండా నిలిపివేశాడు. దీంతో లారీ బోల్తా పడకుండా భారీ ప్రమాదం తప్పినట్లు అయింది. జాతీయ రహదారి నిర్మాణ పనుల సంబంధిత గుత్తేదారు రోడ్డు నిర్మాణ పనులను నాణ్యతగా చేపట్టకపోవడంతోనే తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా రోడ్డు వెడల్పు పనుల్లో భాగంగా చేపడుతున్న రహదారి ప్రక్కన లోతైన గుంతలు తవ్వుతుండడంతో రాత్రివేళ గుంతల్లోకి వాహనాలు వెళ్లకుండా సంబంధిత గుత్తేదారు ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాల్సి ఉండగా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో వాహనదారులకు ప్రమాదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వాహనదారులు ఆరోపిస్తున్నారు. గత 20 రోజుల క్రితం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట ప్రధాన రహదారిపై ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో రాత్రి వేళలో ధాన్యం లారీ బోల్తా పడి లారీ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి జాతీయ రహదారి నిర్మాణ పనుల వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసేలా సంబంధిత గుత్తేదారు పై చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.

