బతుకమ్మ, కోటగిరి : పోతంగల్ మండలం జల్లా పల్లి గ్రామానికి చెందిన శ్రీ వేద హై స్కూల్ పూర్వ విద్యార్థి ధరావత్ మమత ఐఐటీలో సీటు సాధించడంతో ఆమెను గ్రామస్తులు మంగళవారం ఘనంగా సన్మానించారు. సామాజిక కార్యకర్త ఎం ఏ హకీమ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో విద్యార్థినిని పూలమాలలు శాలువాతో సత్కరించి అభినందించారు. గిరిజన పేద కుటుంబంలో జన్మించిన మమత పదవ తరగతిలో మండల టాపరుగా నిలవడం ఇంటర్లో 994 మార్కులు సాధించడం ఐఐటీలో సీటు సాధించడం అభినందనీయమని ఎం ఏ హకీమ్ అన్నారు. జలపల్లి గ్రామాన్ని జాతీయ స్థాయిలో నిలిపిన మమతను అభినందించారు. తల్లిదండ్రులకు, గురువులకు పేరు తెచ్చిన మమత గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఎస్ఐ సునీల్ మాట్లాడుతూ ఒకే కుటుంబంలో నలుగురు ఇంజనీరింగ్ విద్యను చదువుతుండడం పట్ల తండ్రి మిత్యా నాయక్ ను ప్రశంసించారు. గ్రామీణ ప్రాంతంలో చదువుకొని ఐఐటి సీట్లు సాధించడం గర్వకారణం అన్నారు. శ్రీ వేద పాఠశాల యాజమాన్యం ను ఎస్ఐ అభినందించారు. ఈ కార్యక్రమంలో శ్రీ వేద పాఠశాల డైరెక్టర్ తెల్ల రవికుమార్, మండల కాంగ్రెస్ నాయకులు ఎజాస్ ఖాన్, మాజీ సర్పంచ్ షేరు, గ్రామస్తులు పాల్గొన్నారు.
