. . . కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
బాల్కోండ, బతుకమ్మ:
ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరిస్తూ ఇంటింటి కుటుంబ సర్వేలో సమగ్ర సమాచారాన్ని సేకరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. బాల్కొండ మండలం చిట్టాపూర్ గ్రామంలో నిర్వహిస్తున్న ఇంటింటి సర్వే ప్రక్రియను కలెక్టర్ ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎన్యుమరేటర్లు ఇంటింటికి వెళ్లి సమాచారం సేకరిస్తున్న తీరును, నిర్ణీత ఫారాలలో ఆయా కోడ్ ల వారీగా వివరాలు నమోదు చేస్తున్న విధానాన్ని పరిశీలించిన కలెక్టర్, సిబ్బందికి పలు సూచనలు చేశారు. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల గణన కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే జిల్లాలోని 547 గ్రామ పంచాయతీలతో పాటు నిజామాబాద్ నగర పాలక సంస్థ, బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపల్ పట్టణాలలో సజావుగా సాగుతోందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా నివాస గృహాలను ఎన్యుమరేషన్ బ్లాక్ లుగా విభజిస్తూ, 175 ఇళ్లకు ఒక ఎన్యుమరేటర్ ను, 10 మంది ఎన్యుమరేటర్లకు ఒక సూపర్వైజర్ చొప్పున నియమించామన్నారు. సర్వే నిర్వహించాల్సిన తీరుపై శిక్షణా తరగతుల ద్వారా ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు క్షుణ్ణంగా అవగాహన కల్పించామని అన్నారు. సమగ్ర సర్వేను ఆర్డీఓలు, ఎంపీడీఓలు, తహశీల్దార్లు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేస్తున్నారని తెలిపారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా జిల్లాలో సమగ్ర ఇంటింటి సర్వే కొనసాగుతోందని, ప్రజల నుండి సేకరించిన సమాచారాన్ని డేటా ఎంట్రీ ఆపరేటర్ల ద్వారా ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో నమోదు చేసేలా అవసరమైన చర్యలు తీసుకున్నామని కలెక్టర్ వెల్లడించారు. ఎలాంటి సంశయాలకు లోనవకుండా ప్రజలు సర్వే ప్రక్రియలో భాగస్వాములై తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. అంతకుముందు కలెక్టర్ చిట్టాపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో గల పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేశారు.

