ఇందల్వాయి, బతుకమ్మ :
ఇందల్వాయి మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ట్రైనీ ఐఏఎస్, అసిస్టెంట్ కలెక్టర్ సురేష్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి, విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యతను స్వయంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అనే విషయాన్ని ప్రధానోపాధ్యాయుడు వెంకట్రామ్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి, వాటికి నీరు పోశారు. అదే పాఠశాలలో యంగ్ స్టార్ యూత్ సభ్యులు తమ సొంత నిధులతో ఏర్పాటు చేసిన నీటి ట్యాంకును అసిస్టెంట్ కలెక్టర్ సురేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టిన యంగ్ స్టార్ యూత్ సభ్యులను ఆయన అభినందించారు. గురుజాడ అప్పారావు చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడుస్తూ సమాజ సేవకు ముందుకు రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గంగామణి గంగారం, ఉప సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, తహసీల్దార్ బాలయ్య, ప్రధానోపాధ్యాయుడు వెంకట్రామ్ రెడ్డి, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

