. . . మూడు గొర్రెల మృతి
. . . ఐదు గొర్రెలకు తీవ్ర గాయాలు
జుక్కల్, బతుకమ్మ :
జుక్కల్ మండలంలోని బస్వాపూర్ గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వాగ్మరే హనుమంత్కు చెందిన గొర్రెల మందపై సుమారు 20 వీధి కుక్కలు గుంపులుగా వచ్చి దాడి చేశాయి. ఈ ఘటనలో మూడు గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదు గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. గొర్రెల అరుపులు విని గొర్రెల యజమానితో పాటు సమీపంలో విశ్రాంతి తీసుకుంటున్న ఇతర కాపరులు వెంటనే అప్రమత్తమై కుక్కలను తరిమివేశారు. అయితే అప్పటికే భారీ నష్టం జరిగిపోయింది. గ్రామంలో వీధి కుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతోందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల అప్పుగొండవార్ బస్సుగొండకు చెందిన బర్రె దూడపై కూడా వీధి కుక్కలు దాడి చేసి, దాని తోక, చెవులను కొరికేసిన ఘటన చోటుచేసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం మూగజీవులపై వరుస దాడులు జరుగుతుండటంతో పశువుల కాపరులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అలాగే గ్రామ వీధుల్లో చిన్నారులు ఆడుకుంటున్న సమయంలో వారి భద్రతపై కూడా తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రామ సర్పంచ్ వి. రమణ సురేష్ గోండ్ జిల్లా అధికారులకు విజ్ఞప్తి చేస్తూ, వీధి కుక్కల సమస్యను వెంటనే పరిష్కరించి ప్రజలు, పశువులకు రక్షణ కల్పించేలా తగిన చర్యలు చేపట్టాలని కోరారు. గ్రామంలో వీధి కుక్కల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు అధికారులను వేడుకుంటున్నారు.

