జగిత్యాల, బతుకమ్మ :
జగిత్యాల జిల్లా రూరల్ మండలం పొరండ్ల గ్రామంలో విషజ్వరాలు కలకలం రేపుతున్నాయి. రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు చిన్నారులు మృతి చెందడం స్థానికంగా తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఒకే వయస్సు, ఒకే తరగతి చదువుతున్న ఇద్దరు చిన్నారులు పక్కపక్కనే నివసిస్తూ విషజ్వరానికి బలయ్యారని ప్రాథమిక సమాచారం. గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల గ్రామంలో విషజ్వరాల ప్రభావం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రెండు రోజుల వ్యవధిలో హరిస్మిత (6), వరుణ్ తేజ (6) అనే ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఇద్దరూ స్నేహితులు కావడంతో పాటు యూకేజీ విద్యార్థులు, పక్కపక్కనే నివసిస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. హరిస్మిత ఆరోగ్యం విషమించడంతో ఆమె తండ్రి కిరణ్ దుబాయ్ నుంచి అత్యవసరంగా గ్రామానికి చేరుకున్నప్పటికీ చిన్నారిని కాపాడలేకపోయారు. అంతకుముందు వరుణ్ తేజ కూడా జ్వర లక్షణాలతో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు తెలిసింది.

