రాజన్న సిరిసిల్ల, బతుకమ్మ :
జిల్లా రవాణా శాఖ అధికారి దేవునూరి శ్రీనివాస్ ఆదేశాల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో విస్తృత వాహన తనిఖీలు నిర్వహించారు. కలెక్టర్ చౌరస్తా, వేములవాడ, కోడూరుపాక ప్రాంతాల్లో మోటార్ వాహనాల తనిఖీ అధికారి వంశీధర్ ఆధ్వర్యంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ బృందం ఈ తనిఖీలు చేపట్టింది. తనిఖీల్లో భాగంగా సరుకు రవాణా వాహనాల్లో అక్రమంగా ప్రయాణికులను తరలిస్తున్న నాలుగు వాహనాలను సీజ్ చేశారు. అలాగే పర్మిట్ లేని లారీలు, ఫిట్నెస్ లేని ట్రాక్టర్లు, నిబంధనలు ఉల్లంఘించిన గూడ్స్ వాహనాలు, డ్రైవింగ్ లైసెన్స్ లేని వాహనదారులపై కలిపి 20 కేసులు నమోదు చేసినట్లు మోటార్ వాహనాల తనిఖీ అధికారి వంశీధర్ తెలిపారు. ఈ తనిఖీల్లో పలు జిల్లాలకు చెందిన సహాయక మోటార్ వాహనాల తనిఖీ అధికారులు సాగర్, నిఖిల్ కుమార్ రెడ్డి, రామారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. జిల్లాలో ఇటువంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. ఓవర్లోడ్తో వాహనాలు నడపవద్దని, సరుకు రవాణా వాహనాల్లో ప్రయాణికులను తరలించడం చట్టవిరుద్ధమని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారి పర్మిట్, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడంతో పాటు కోర్టు ద్వారా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

