బాన్సువాడ, బతుకమ్మ :
బాన్సువాడ మండలంలోని దేశాయిపేట్ గ్రామం నుంచి తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు శనివారం భక్తిశ్రద్ధలతో పాదయాత్ర నిర్వహించారు. దేశాయిపేట్ గ్రామంలోని హనుమాన్ మందిరం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులు భజనలు, నామస్మరణలతో బైరాపూర్లోని ప్రసిద్ధ విఠలేశ్వర (విఠోబా) ఆలయం వరకు కాలినడకన చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. తొలి ఏకాదశి రోజున విఠోబా స్వామిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలో ప్రతి ఏడాది దేశాయిపేట్ గ్రామం నుంచి బైరాపూర్ వరకు పాదయాత్ర సంప్రదాయంగా నిర్వహిస్తున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు. ఈ పాదయాత్రలో మాజీ ఎంపీపీ మూనేకర్ ప్రకాష్, ఉపసర్పంచ్ పండరి గౌడ్, అంజయ్య మహారాజ్, కబీర్ మహారాజ్, బొజ్జ భాస్కర్, జానకి రమేష్, వంజరి రమేష్, గంట గంగాధర్తో పాటు గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో విఠలేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
