బాల్కొండ, బతుకమ్మ :
ఎల్ నినో కారణంగా ప్రస్తుతం ఎదురవుతున్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రైతులు ఆరుతడి పంటల సాగును చేపట్టాలని బాల్కొండ మండల వ్యవసాయ అధికారి లావణ్య తెలిపారు. బుధవారం వ్యవసాయ, ఉద్యానవన శాఖల సంయుక్త ఆధ్వర్యంలో రైతులకు ఎల్ నినో ప్రభావం మరియు ఆరుతడి పంటల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏవో మాట్లాడుతూ భారత వాతావరణ శాఖ సూచనల మేరకు ఈ ఏడాది అత్యల్ప వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నందున రైతులు అందుబాటులో ఉన్న సాగునీటి వసతులను సద్వినియోగం చేసుకుంటూ ఆరుతడి పంటల సాగును చేపట్టాలని సూచించారు. అత్యధిక నీటి అవసరం ఉండే వరికి బదులుగా జొన్న, సజ్జ, వేరుశనగ, సోయాబీన్ లాంటి చిరుధాన్యాలు, నూనె గింజ పంటల సాగును ప్రోత్సహించాలని తెలిపారు. అలాగే తక్కువ సాగు నీటి అవసరం ఉండే పండ్లు, కూరగాయలు, పూల మొక్కల సాగుతో రైతులు నిరంతరాదాయం పొందవచ్చని సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు రేష్మ, కావ్య, హెచ్ఓ రుద్ర వినాయక్, హెచ్ఈఓ సునీల్, ఆయిల్ పామ్ ఫీల్డ్ ఆఫీసర్ ఐజాక్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
