నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ప్రజా సమస్యలను నేరుగా స్వీకరించి పరిష్కరించేందుకు నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం నిజామాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో 25 ఫిర్యాదులను స్వీకరించారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు అదనపు డి.సి.పి (అడ్మిన్) శుభం ప్రకాష్ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల సమస్యలను ఆయన స్వయంగా విని, వాటిని చట్టపరంగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకోవాలని సూచిస్తూ, సంబంధిత పోలీస్ స్టేషన్ల ఎస్.ఐలు, సి.ఐలతో ఫోన్ ద్వారా మాట్లాడి సమస్యల స్థితిగతులను తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా అదనపు డి.సి.పి (అడ్మిన్) మాట్లాడుతూ ప్రజలు ఎలాంటి భయాందోళనలు లేకుండా, మధ్యవర్తులు లేదా పైరవీలకు తావులేకుండా నేరుగా పోలీస్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ప్రజల సమస్యలను చట్ట ప్రకారం పరిష్కరించడం, పోలీస్ శాఖపై ప్రజల నమ్మకాన్ని మరింత పెంచడం, శాంతి భద్రతలను పరిరక్షించడం జిల్లా పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ సమస్యలకు సంబంధించి మొత్తం 25 ఫిర్యాదులను స్వీకరించారు.
