. . . ఎస్సైని మధ్యాహ్నం వరకు నిలబెడే ఉండాలని హైకోర్టు జడ్జీ ఆదేశాలు
. . . మధురా నగర్ ఎస్సై తీరుపై ఆగ్రహం
హైదరాబాద్, బతుకమ్మ :
ఖాకీ చొక్కా వేసుకున్నంత మాత్రాన చట్టాలు మాకు చుట్టాలు అనుకునే కొందరు పోలీసు అధికారుల అహంకారానికి న్యాయస్థానం గట్టిగా ముకుతాడు వేసింది. సమాజంలో శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులే స్వయంగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అత్యంత అమానుషంగా ప్రవర్తిస్తే న్యాయవ్యవస్థ చూస్తూ ఊరుకోదని ఈ తాజా ఘటన స్పష్టం చేస్తోంది. ఒక రిటైర్డ్ అధికారి పట్ల మధురానగర్ ఎస్సై ప్రవర్తించిన తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ విధించిన శిక్ష ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను నిశితంగా పరిశీలిస్తే పోలీసుల మితిమీరిన ప్రవర్తన స్పష్టంగా కనిపిస్తోంది. మే 18న యూసుఫ్గూడలోని తన నివాసంలో ఉన్న రిటైర్డ్ ఎస్సై ఉస్మాన్ ను మధురానగర్ పోలీసులు ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా బలవంతంగా ఈడ్చుకెళ్లారు. కేవలం అండర్ వేర్, బనియన్తో మాత్రమే ఉన్న ఆ వృద్ధుడిని కనీసం బట్టలు కూడా వేసుకోనివ్వకుండా ఇంటి నుండి దారుణంగా లాక్కెళ్లడం తీవ్ర కలకలం రేపింది. ఈ అన్యాయంపై బాధితుడు హైకోర్టును ఆశ్రయించగా జస్టిస్ టీ మాధవీదేవి ధర్మాసనం ఈ పిటిషన్పై సుదీర్ఘ విచారణ చేపట్టింది. గురువారం విచారణ సంధర్బంగా బాధితుడి పరిస్థితిని పోలీసుల అరాచకాన్ని తీవ్రంగా పరిగణించిన గౌరవ న్యాయమూర్తి సదరు మధురానగర్ ఎస్సైపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎస్సై అయితే నీ ఇష్టం వచ్చినట్లు చేస్తావా అని పోలీస్ అయినంత మాత్రాన దేశ చట్టాలను పూర్తిగా ఉల్లంఘిస్తావా అంటూ కోర్టు బోనులో ఉన్న అధికారిపై ధర్మాసనం నిప్పులు చెరిగింది. చట్టాన్ని రక్షించాల్సిన వ్యక్తులే ఇలాంటి అనాగరిక చర్యలకు పాల్పడితే సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తూ సదరు ఎస్సైని మధ్యాహ్న భోజన సమయం వరకు అంటే లంచ్ అవర్ ముగిసేంత వరకు కోర్టులోనే నిలబడాలని ఆదేశించి సంచలన శిక్ష విధించింది. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్రమైన విచారణ జరపాలని భావించిన హైకోర్టు తదుపరి చర్యల కోసం కఠినమైన ఆదేశాలను జారీ చేసింది. ఈ ఘోర ఘటనకు సంబంధించి నగర పోలీస్ కమిషనర్ నుంచి పూర్తి స్థాయి నివేదికను తెప్పించుకుని తమకు అందజేయాలని ప్రభుత్వ న్యాయవాదిని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఖాకీ నిరంకుశత్వానికి అడ్డుకట్ట వేయకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదమని భావించిన కోర్టు ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది. ఈ రకమైన పరిణామాలు సమాజంలో పోలీసుల బాధ్యతను చట్టం ముందు అందరూ సమానులే అనే నిజాన్ని మరోసారి గుర్తుచేస్తున్నాయి.
