. . . వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
జిల్లాలోని 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాల్లో విద్యుత్ సరఫరా నాణ్యతను మెరుగుపరిచేందుకు కెపాసిటర్ బ్యాంకుల ఏర్పాటు చేపడుతున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా ఏఆర్పీ క్యాంప్ 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రంలో కెపాసిటర్ బ్యాంక్ను ఏడీఈ (కన్స్ట్రక్షన్) తోట రాజశేఖర్ సాంకేతికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కెపాసిటర్ బ్యాంకుల ఏర్పాటు ద్వారా వ్యవసాయదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడంతో పాటు ఓల్టేజ్ పెరుగుతుందని, 33 కేవీ లైన్ నష్టాలు తగ్గుతాయని తెలిపారు. అలాగే పవర్ ట్రాన్స్ ఫార్మర్లపై భారం కూడా తగ్గుతుందని పేర్కొన్నారు. గౌరవ సీఎండీ ఆదేశాల మేరకు జిల్లాలోని 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాల్లో దశలవారీగా కెపాసిటర్ బ్యాంకుల ఏర్పాటు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో కల్లూరు, శ్రీనగర్, ఏఆర్పీ క్యాంప్ విద్యుత్ ఉపకేంద్రాల్లో కూడా కెపాసిటర్ బ్యాంకులను ప్రారంభించారు. ఇప్పటివరకు నిజామాబాద్ జిల్లాలో మొదటి విడతలో 31, రెండో విడతలో 11, మూడో విడతలో 41 కెపాసిటర్ బ్యాంకులను వివిధ విద్యుత్ ఉపకేంద్రాల్లో ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక లైన్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, లైన్మెన్ సాయిబాబా, సిల్వెల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాజెక్ట్ ఇంజనీర్ శ్రీకాంత్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
