. . . సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ.రమేష్ బాబు
నవీపేట్, బతుకమ్మ :
విద్య, వైద్యం అనేది పేద, మధ్యతరగతి ప్రజలకు ప్రైవేట్ సంస్థల్లో అందని ద్రాక్ష లా మారిందని, అందువల్ల మెరుగైన ఉచిత వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనే ఉందని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ.రమేష్ బాబు అన్నారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గురువారం నవీపేట్ మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను సందర్శించి వైద్య సిబ్బందితో, స్థానిక ప్రజలతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల కేంద్రంలో ఉన్న హాస్పిటల్లో సౌకర్యాలను పెంచితే మరింత మంది పేద, మధ్యతరగతి ప్రజలకు వైద్యం అందుబాటులో ఉంటుందని అందుకొరకు 50 పడకల ఆసుపత్రిగా దీనిని ఏర్పాటు చేయాలని అన్నారు. అదే విధంగా సౌకర్యాలను పెంచాలని, వైద్యుల సంఖ్యను పెంచాలని, మహిళల ప్రసవాల కొరకు ప్రైవేట్ హాస్పటల్ కు జిల్లా కేంద్ర ఆస్పత్రికి పంపకుండా స్థానికంగానే ప్రసవాలను పెంచితే ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. అదే విధంగా గ్రామీణ ప్రాంతాల నుండి పాముకాటుతో, కుక్క కాటుతో వచ్చిన వాళ్లకు మెరుగైన వైద్య చికిత్స అందించడానికి రాబిన్ వ్యాక్సిన్ లతో పాటు, పాము కాటు వ్యాక్సిన్ అందుబాటులో ఉంచాలని, ఆపరేషన్ సెంటర్ లను మెరుగుపరచాలని, తగినంత వైద్య సిబ్బంది ఉంటే మెరుగైన వైద్యం అందటానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి నాయక్ వాడి శ్రీనివాస్, నాయకులు దేవేందర్ సింగ్, మహబూబ్, శంషు, సావిత్రి, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

