నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
వీర జవాన్ల సేవలను స్మరించుకుంటూ, వారి కుటుంబ సభ్యులను గౌరవించే కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర సైనిక సంక్షేమ శాఖ సంచాలకులు బ్రిగేడియర్ ఎన్.ఆర్. బాబు (రిటైర్డ్) పాల్గొని వీర జవాన్ కుటుంబ సభ్యులను సన్మానించారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఆదర్శ్ నగర్, దుబ్బాలోని సైనిక్ భవన్, ప్రాంతీయ సైనిక సంక్షేమ కార్యాలయంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు బ్రిగేడియర్ ఎన్.ఆర్. బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా వీర జవాన్ నీరడి గంగాప్రసాద్ భార్య నీరడి శిరీషను, అలాగే ఎర్రం నర్సయ్య తల్లి ఎర్రం కళావతిని ఘనంగా సన్మానించారు. అనంతరం మాజీ సైనికులు, మాజీ సైనిక వితంతువులు, యుద్ధ వితంతువులు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ద్వారా మాజీ సైనికులు, వారి కుటుంబాలకు అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారి డి. రవీందర్తో పాటు సిబ్బంది సులేమాన్, బదాం గంగామోహన్, ఉమర్ పాల్గొన్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల మాజీ సైనిక సంక్షేమ సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు సుర హారప్రసాద్, పాపి రెడ్డి, గుజరాతీ గంగామోహన్, సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాజీ సైనికులు, వితంతువులు, యుద్ధ వితంతువులు, వారి కుటుంబ సభ్యుల హాజరుతో అవగాహన సదస్సు విజయవంతంగా ముగిసింది.

