. . . జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ప్రభుత్వం నిర్దేశించిన మేరకు కామన్ డైట్ మెనూను అనుసరిస్తూ విద్యార్థులకు నాణ్యతతో, పరిశుభ్రతతో కూడిన పౌష్టికాహారం అందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. డిచ్ పల్లి మండలం సుద్దపల్లి లోని సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను కలెక్టర్ మంగళవారం సందర్శించారు. సిబ్బంది హాజరు పట్టికను తనిఖీ చేశారు. కిచెన్, డార్మెటరీ, డైనింగ్ హాల్ లను పరిశీలించి సదుపాయాలను గమనించారు.

పుస్తకాలు, నోట్ బుక్కులు పూర్తి స్థాయిలో వచ్చాయా అని ఆరా తీశారు. బాలికల కోసం వండిన అన్నం, పప్పు, ఇతర ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు. ఆహార పదార్థాలు కలుషితం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షాకాలం దృష్ట్యా పరిసరాలతో పాటు కిచెన్, డైనింగ్ హాల్ లను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. బాలికల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, తల్లిదండ్రులు, సంరక్షకులు వస్తేనే వారితో పంపాలని సూచించారు.

ఎక్కువ రోజుల పాటు పాఠశాలకు హాజరు కాని విద్యార్థినుల పట్ల ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని, వారు ఎందుకు పాఠశాలకు రావడం లేదనే విషయాన్ని ఆరా తీయాలన్నారు. పాఠశాలలో పెండింగ్ పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ పనులను తక్షణమే చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. పెండింగ్ నిర్మాణాలను పూర్తి చేసి విద్యార్థులకు అన్ని వసతులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. అనంతరం సెకండియర్ క్లాస్ రూమ్ కు వెళ్లి విద్యార్థినులకు పలు సబ్జెక్టులలో ప్రశ్నలు వేస్తూ, సమాధానాలు ఇచ్చిన వారికి బహుమతులు అందజేశారు. చక్కగా చదువుకోవాలని, ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట ఇంచార్జి ప్రిన్సిపాల్ స్వప్న, పాఠశాల సిబ్బంది ఉన్నారు.

